సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ ప్రమాణాలు.. అత్యాధునిక మౌలిక వసతులు.. నిమిషాల్లో ఔటర్ రింగు రోడ్డు పైకి.. అక్కడి నుంచి అరగంటలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు.. ఇది ఐటీ కారిడార్కు ఉన్న ప్రత్యేకత. దీంతో ఐటీ కారిడార్ ప్రాంతమంతా ఆకాశమే హద్దు.. అన్నట్లుగా దూసుకెళ్తున్నది. 20 ఏండ్ల కిందటి హైటెక్ సిటీ అంటే మాదాపూర్లోని సైబర్ టవర్స్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అప్పుడు దాని అంతస్తులు కేవలం 10 మాత్రమే. తాజాగా ఐటీ కారిడార్లో నిర్మాణంలో ఉన్న భవనాల అంతస్తులు అత్యధికంగా 58అంతస్తులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ కారిడార్ అత్యంత వేగంగా విస్తరించింది. ప్రస్తుతం ఐటీ కారిడార్లో ఎక్కడ చూసినా అద్దాల మేడలతో రూపుదిద్దుకుంటున్న ఆకాశ హార్మ్యాలు, మాల్స్, మల్టీఫ్లెక్సులు, విందు, వినోదం, మెట్రో రైలు, ఇలా.. డల్లాస్ను తలపిస్తున్నాయి.
ఒక్కో భవనం.. ఒక్కో ప్రత్యేకత..
వందల ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఐటీ కారిడార్ ఆధునీకతకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఆకాశమే హద్దుగా వెలుస్తున్న భవనాలు నగరానికి సరికొత్త వన్నె తీసుకువస్తున్నాయి. ఒకదాన్ని మించి మరో భవనం.. దేనికదే ప్రత్యేకత.. అన్నట్లుగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. స్కై వ్యూ, గెలాక్సీ, సాస్ క్రౌన్, అమెజాన్, ఫీనిక్స్ బీ హబ్, ల్యాంకో హిల్స్.. ఇలా వందకు పైగా ఐకానిక్ అని పిలిచేలా, ఆధునీకతను నిలువునా నింపుకున్న అద్దాల మేడలు ఐటీ కారిడార్లో కనిపిస్తున్నాయి. ఐటీ కార్యాలయాల భవనాలే కాదు.. వ్యాపార కేంద్రాలైన మాల్స్, మల్టీప్లెక్సులు, నివాస భవనాలు అన్నీ ఒకేచోట కొలువుదీరుతూ ఆకాశ హార్మ్యాలుగా వెలుస్తున్నాయి. కాలం మారుతున్నాకొద్ది భవనాల రూపం (ఆర్కిటెక్చర్) అద్భుతంగా ఉండేలా దేశ, విదేశాల్లో పేరొందిన ఆర్కిటెక్టులతో డిజైన్లను రూపొందించి ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపడుతున్నాయి.
నాటి భవనాలు.. నేడు సరికొత్తగా..!
హైదరాబాద్ మహానగరంలో మాదాపూర్ కేంద్రంగా ప్రారంభమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది. మాదాపూర్ తర్వాత కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, పుప్పాల్గూడ, నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లో అకాశమే హద్దుగా.. ఐటీ కంపెనీల కార్యాలయాల కోసం భవనాలు వెలుస్తున్నాయి. నాడు మాదాపూర్ కేంద్రంగా వెలిసిన ఐటీ కారిడార్లో 10 నుంచి 12 అంతస్తులకు మాత్రమే పరిమితం కాగా.. ప్రస్తుతం వాటి స్థానంలో 20, 30, 40,50 అంతస్తుల పైబడిన భవనాలు నిర్మిత మవుతున్నాయి.
రహేజా మైండ్ స్పేస్ పార్కులో..
మాదాపూర్ ఐటీ కారిడార్లో రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్కుకు ఎంతో పేరుంది. ఐటీ సెజ్గా ఉన్న ఈ పార్కులో 1ఎ, 1బీగా ఉన్న రెండు భవనాలు 7 అంతస్తుల వరకు ఉండగా.. వాటి స్థానంలో కొత్తగా 23 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించనున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు భవనాల్లో 36వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ ఉంటే, కొత్తగా నిర్మించనున్న భవనంలో 1.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఇలా మాదాపూర్ ప్రాంతంలో 15-20 ఏండ్ల కిందట నిర్మించిన భవనాలను తొలగించి వాటి స్థానంలో ఆకాశ హార్మ్యాలుగా నిర్మించేందుకు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు తమ కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఐటీపీహెచ్ భవనం స్థానంలో..
రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా నుంచి దుర్గం చెరువు వెళ్లే మార్గంలో ఉన్న అసెండాస్ ఇండియా ట్రస్ట్ సంస్థ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్(ఐటీపీహెచ్) పేరుతో 10 అంతస్తుల లోపు నిర్మించిన భవనాన్ని కూల్చివేసి కొత్తగా 14 అంతస్తులతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నది. ఇందులో ఆఫీసులకు లీజుకు ఇచ్చే స్థలం మొదట 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. ఇప్పుడు 5.7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నది. దీనికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో దశ భవనానికి సంబంధించిన కూల్చివేతలు త్వరలోనే చేపట్టనున్నారు.
పాత హెచ్ఎస్బీసీ భవనం స్థానంలో..
రాయదుర్గ మెట్రో స్టేషన్ సమీపంలోని లేమన్ ట్రీ పక్కన ఉన్న హెచ్ఎస్బీసీకి చెందిన భవనాలు ఆరు అంతస్తుల్లో ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తగా 14 అంతస్తులతో నూతన భవనాన్ని నిర్మించనున్నది. హెచ్ఎస్బీసీ ఉన్న భవనాలను నగరానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూ.247.5 కోట్లకు కొనుగోలు చేసి ఇప్పుడు రూ.110 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించనున్నది. ఇందులో అద్దెకు ఇచ్చే స్థలం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.
ఇనార్బిట్ మాల్స్లోనూ..
ఐటీ కారిడార్లో మాల్ అండ్ మల్టీఫ్లెక్స్ అంటే ఇనార్బిట్ మాల్. ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర వాసులకు సరికొత్త మాల్స్, మల్టీఫ్లెక్స్ అనుభూతిని కల్పించిన ఇనార్బిట్ మాల్ను సరికొత్తగా ఆధునీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు సైతం ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. పెరుగుతున్న రద్దీతో పాటు మారుతున్న అభిరుచులకు అనుగుణంగానే ఈ మాల్లో అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.
10 అంతస్తులతో మొదలై.. 58కి చేరిక..!
మొన్నటివరకు 10, 20 అంతస్తులతో ఉన్న ఐటీ కార్యాలయాల భవనాల అంతస్తులు ఇప్పుడు ఒకేసారి 58 అంతస్తుల వరకు చేరుకున్నాయి. కోకాపేట, నానక్రాంగూడ ప్రాంతాల్లో 45 నుంచి 58 అంతస్తులతో కూడిన భవనాలు పది వరకు ఉండగా, హెచ్ఎండీఏ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో మరిన్ని భవనాలు ఉన్నాయి. మరో 4-5 ఏండ్లలో ఐటీ కారిడార్ కోకాపేట నుంచి కొల్లూరు వరకు, మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు ఐటీ కంపెనీలకు అవసరమైన కార్యాలయ భవనాలతో పాటు ఐటీ ఉద్యోగుల కోసం హైరైజ్ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు ఏర్పాటవుతున్నాయి.