నానాటికీ పెరుగుతున్న కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య
ఆఫీస్ స్పేస్లో భారీ ఎత్తున కొనసాగుతున్న డిమాండ్
తాజాగా ఎంబసీ- సాస్ గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం
మూడు ప్రాజెక్టులతో అందుబాటులోకి 14 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ స్పేస్ డిమాండ్లో దేశంలోనే ముందంజలో ఉన్న హైదరాబాద్ రియల్ రంగానికి రిటర్న్ టు ఆఫీస్ (ఆర్టీవో) మరింత ఊపునిస్తున్నది. ప్రధానంగా నగరంలోని ఐటీ కారిడార్లో కొవిడ్కు ముందున్న పరిస్థితుల మాదిరిగానే ఐటీ కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా కనీవినీ ఎరుగని రీతిలో మౌలిక వసతులను కల్పిస్తుండటంతో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఒకవైపు కార్పొరేట్ సంస్థల్లో రికార్డు స్థాయి నియామకాలు జరుగుతుండటంతో పాటు మరోవైపు సంస్థల విస్తరణతో రియల్ సంస్థలు ఆఫీస్ స్పేస్ నిర్మాణానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బుధవారం నగర వేదికగా మరో కీలకమైన ఒప్పందం జరిగింది. రియల్ సంస్థ అయిన ఎంబసీ గ్రూపు-సాస్ ఇన్ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఐటీ కారిడార్లో కీలకమైన నానక్రాంగూడ, ఖాజాగూడలో మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)ల్లో రికార్డు నియామకాలు జరుగుతున్నాయి. కొవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫైర్ (ఉద్యోగుల తొలగింపు) అనేది ఏ ఒక్క సంస్థలోనూ కనిపించలేదు. దీనికి తోడు ఐటీ ప్రాజెక్టులు ఎక్కువ అవడంతో భారీ ప్యాకేజీలకు ఉద్యోగులు అట్రిషన్ (ఒక సంస్థ నుంచి మరో సంస్థకు వలస) పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దీంతో సంస్థలు అనేక విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుదల నమోదవుతుంది.
అందుబాటులోకి కొత్తగా…
ఎంబసీ గ్రూపు- సాస్ ఇన్ఫ్రా మధ్య ఒప్పందంతో హైదరాబాద్ మార్కెట్లోకి ఏకంగా 14 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానున్నది. ఇటీవల రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాలు, హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల కారణంగా గ్రేడ్-ఏ వర్క్ స్పేస్కు భారీ డిమాండ్ పెరుగుతుందని ఎంబసీ గ్రూపు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆదిత్య విర్వానీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎంబసీ-సాస్ గ్రూపులు తలపెట్టిన మూడు ప్రాజెక్టులు వచ్చే ఏడాది చివరి నుంచి అంచెలంచెలుగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మొదటి ప్రాజెక్టులో భాగంగా 36 అంతస్తుల్లో ఎంబసీ సాస్ టవర్ను 5.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రెండో ప్రాజెక్టులో భాగంగా మూడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంబసీ డైమండ్ టవర్ను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ నిర్మాణ పనులకు సంబంధించిన తవ్వకాలు మొదలయ్యాయి. మూడో ప్రాజెక్టులో భాగంగా క్రౌన్ పేరిట మూడు మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొదటి రెండు ప్రాజెక్టులకు ఎంబసీ గ్రూపు డెవలప్మెంట్ మేనేజర్గా వ్యవహరిస్తున్నది. నిర్మాణం, విక్రేతలు, లీజింగ్ను పర్యవేక్షిస్తుంది.