సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ)/బేగంపేట : ఇరాక్ దేశానికి చెందిన 20 ఏండ్ల సజ్జాద్ అమీన్ మత్రూద్ అల్ హస్నవి పుట్టుకతోనే వంకర కాళ్లతో పుట్టాడు. ఇరాక్లో దీనికి చికిత్స లేదు. ఇతర పెద్ద దేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత అతని కుటుంబానికి లేదు. హైదరాబాద్లో ఇందుకు చికిత్స ఉందని తెలిసి ఇక్కడకు రావడంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి జన్యుపరంగా వచ్చిన లోపాన్ని సరిచేశారు. రెండు, మూడు నెలల వ్యవధిలోనే అతడికి రెండుసార్లు కంప్యూటర్ నేవిగేటెడ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్(టేలర్ స్పేషియల్ ఫ్రేమ్) శస్త్ర చికిత్సలు చేశారు.
వంకర కాళ్లకు శస్త్ర చికిత్స చేసేసమయంలో కాలు పొట్టిగా ఉండడాన్ని గుర్తించి ఆ సమస్యనూ పరిష్కరించారు. కొద్దిరోజులకే సజ్జాద్ అమీన్ వైకల్యం నయమై సాధారణ స్థితికి వచ్చాడు. ప్రస్తుతం అతను తన శరీర బరువును మోస్తూ సొంత కాళ్లమీద నడవగలుగుతున్నాడు. కిమ్స్ దవాఖానకు చెందిన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ కాషా కంప్యూటర్ నేవిగేషన్ ద్వారా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.