సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు, బీజేపీకి క్యాడర్ లేక ఆ పార్టీ అభ్యర్థులు డీలా పడుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం బలమైన క్యాడర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో సత్తా చాటుతున్నారు. నియోజకవర్గ సమన్వయ సమావేశాలు, బూత్ స్థాయి కమిటీల సమీక్షలు, మార్నింగ్ వాక్లు, సాయంత్రం కాలనీ, అసోసియేషన్ సంఘాలతో సమావేశాలతో ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలిపోవడంతో ప్రచారంలో మరింత జోరు పెంచారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ఉదయం, సాయంత్రం ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేశారు.
అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపై దృష్టి సారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికలు ఉండగా.. ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటు వేయగలరో చెప్పే నాయకులను పట్టుకొని వీళ్లలో ఓటరు జాబితా పట్టుకొని టిక్కులు పెడుతున్నారు. అలా టిక్కులు పెట్టి వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మీయ బస్తీ, కాలనీ సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగడుతున్నారు. మత పెద్దలు, సామాజిక వర్గాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీ సంఘాలు, కార్మిక , ఉద్యోగ సంఘాలతో అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు సమావేశమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా అభ్యర్థుల ప్రచారం మరింత హీటెక్కింది. సెకన్ల వ్యవధిలో లక్షలాది మందికి చేరే అవకాశం ఉండడంతో ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రోజువారీ తమ కార్యక్రమ వివరాలతో పాటు గెలిపిస్తే.. ఏం చేస్తామో వివరిస్తున్నారు. ఆదే సమయంలో తమపై ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు కూడా కౌంటర్ ఇచ్చేలా వీడియోలు రూపొందించి జనాల్లోకి వదులుతున్నారు.