మెహిదిపట్నం జూన్ 28: నాన్న హాస్టల్లో ఉండటం నాకు ఇష్టం లేదు.. వచ్చి ఇంటికి తీసుకొని పో.. అని ఓ కొడుకు కోరగా.. రేపు వస్తా బిడ్డ అంటూ ఒకరోజు ఆలస్యం చేసిన తండ్రి.. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాడు (Student Suicide). ఈ హృదయ విదారక సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జహీరాబాద్కు చెందిన మహిపాల్కు ప్రభాస్ (17) ఒకే ఒక్క కుమారుడు. అతడు గోల్కొండ సమీపంలోని అల్కాపూర్ రోడ్డులో ఉన్న షేక్పేట్ గురుకుల హాస్టల్ పాఠశాలలో ఉంటూ ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్నాడు. మూడు రోజులుగా తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని, వచ్చి తీసుకెళ్లాలని తండ్రికి ఫోన్ చేసి కోరుతున్నాడు.
శుక్రవారం తండ్రి మహిపాల్ రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాస్ శనివారం ఉదయం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.