సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్ జిల్లాలో 1.53 లక్షలు, రంగారెడ్డిలో 1.14 లక్షలు, మేడ్చల్ 1.07 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గ్రేటర్ పరిధిలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు మొత్తం 3.74 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
తొలిరోజు ఫస్టియర్..
తొలి రోజు ఫస్టియర్ పరీక్షలు జరుగనుండగా, విద్యార్థులు కేంద్రాలకు ఒక గంట ముందే చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్లో 234, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్ జిల్లాలో 120 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. రూట్ పాసులు ఉన్న విద్యార్థులు ఆ మార్గాల్లోనే కాకుండా హాల్టికెట్, బస్పాస్ కలిపి చూపిస్తే.. వేరే రూట్లలో కూడా ప్రయాణం చేసే వీలును కల్పించినట్లు చెప్పారు. కాగా, ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధిస్తూ.. సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.