అమీర్పేట్, మే 5: ఇన్స్టా మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం సనత్నగర్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్నగర్ శ్రీరామ్నగర్కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్ఫరాజ్ (16)స్థానిక మదర్సాలో ఇస్లామిక్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కలిగి ఉన్న సర్ఫరాజ్ శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మదర్సా మిత్రులు మహ్మద్, అంజద్లతో కలిసి రైల్వేట్రాక్పై ఇన్స్టా షూట్ చేసేందుకు సనత్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేట్రాక్పైకి చేరుకున్నారు.
ఎంఎంటీఎస్ రైలుకు అతి సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఫోన్లో చిత్రీకరించే క్రమంలో లింగంపల్లి నుంచి సనత్నగర్ మీదుగా ఫతేనగర్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నది.