మాదాపూర్, ఏప్రిల్ 8: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నారని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఈ నెల 6న జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సయ్య, ఎస్సైలు, సిబ్బందితో కలిసి కేబుల్ బ్రిడ్జిపై పోలీసులు కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మల్లేశ్ మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జిని చూడాలనుకునే వారు కోహినూర్ వద్ద వాహనాలను ఆపి ఫుట్పాత్ ద్వారా నడుచుకుంటూ రావాలన్నారు. ప్రజల అవగాహన నిమిత్తం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను ఆపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. ఎస్సై వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.