సుల్తాన్బజార్, మార్చి 24: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం బేగంబజార్, టాస్క్ఫోర్స్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి వద్దనుంచి రూ. 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం బేగంబజార్, సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఫీల్కానా జైన్ మందిర్ రోడ్లోని విష్ణు ఫైర్ వర్క్స్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కనిపించారు. పోలీసుల తనిఖీలు చూసిన వారిద్దరు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ ద్విచక్ర వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేయగా.. హవాలా నగదు బయటపడింది. పోలీసుల విచారణలో వారిద్దరి పేర్లు సుర్కంటి కిరణ్రెడ్డి(30), కల్లెం జంగారెడ్డి(31) అని తేలింది. నగదుకు సంబంధించిన వివరాలు అడుగగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని, దీంతో ఆ నగదు సీజ్ చేశామని, ఈ నగదును ఐటీ శాఖకు అప్పగిస్తామని బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ తెలిపారు.