అబిడ్స్, మార్చి 9 : ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీంతో గ్రామీణ భారతదేశంలోని వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మనోజ్కుమార్ అన్నారు. అంతేగాకుండా ఖాదీ గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మోదీ సర్కార్కి గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామోద్యోగ్ వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పలు చేతి వృత్తుల్లో శిక్షణ పొందిన వారికి ఉచితంగా యంత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా ఖాదీ వేతనాన్ని 33 శాతానికి పైగా పెంచడం వలన చేత్తి వృత్తుల వారు ఖాదీ పని వైపు వెళ్లారన్నారు. అంతకు ముందు తేనె టీగల బాక్సులు, బీ బాక్సులు, చేతి వృత్తి దారులకు టూల్ కిట్లు, యంత్రాలు, ఎలక్ట్రిక్ కుమ్మరి సారెలు, చింతపండు ప్రాసెసింగ్ మిషన్లు, అగరువత్తి, ఫుట్వేర్ తయారీ యంత్రాలు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ టూల్ కిట్లు, పేపర్, లీఫ్ ప్లేట్ మేకింగ్ యంత్రాలను 1234 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.