ఖైరతాబాద్: తాతను కిరాతకంగా చంపి తప్పించుకొని తిరుగుతున్న మనువడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం… సోమాజిగూడ డివిజన్లోని బీఎస్మక్తాలో నివాసం ఉండే వీసీ జనార్దన్ రావు(86)ను ఈ నెల 6వ తేదీన మనవడు కిలారు కీర్తీ తేజ (29) విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో పాటు అడ్డు వచ్చిన తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చేర్పించారు. గత 48 గంటల నుంచి పరారీలో ఉన్న నిందితుడిని శనివారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడి తల్లిదండ్రులు వేర్వేరు ఉండటంతో ఒంటరి తనంతో కుంగిపోయానని, ఈ విషయంతో పాటు ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులకు వివరించాడు. ఈ నేపథ్యంలో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్ తరలించినట్లు పేర్కోన్నారు.