హైదరాబాద్ : భారతరాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ( AIPSO ) రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల భారత ప్రజాస్వామ్య దేశంలో అక్షరాస్యత శాతం బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై అవగాహన అవసరమని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అవగాహన కలిగితే ఈ దేశ ప్రజలను అభ్యుదయ మార్గం వైపు నడిపిస్తాయన్నారు. భారత రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన కలిగితే సామాజిక స్పృహ పెంపొంది.. అది వ్యక్తిగత జీవితానికి, సమాజంలో శాంతియుత వాతావరణానికి దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతున్న సందర్భంలో రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన విషయాల పట్ల అవగాహన ఉన్న వారికి సామాజిక స్పృహ పెంపొంది వ్యక్తిగత జీవితంతోపాటు దేశ పురోగమనానికి ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ తెలిపారు.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలోనే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడబడుతున్నాయని, అందుకు రాజ్యాంగమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, దేశ శాంతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, అందుకు కంకణబద్ధులుకావాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాల పేరిట విద్వేషాలను పెంచి పోషిస్తున్న పార్టీలు, కుహనా జాతీయవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని వినోద్ కుమార్ సూచించారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు కేవీఎల్, బొమ్మగాని ప్రభాకర్, డాక్టర్ సుధాకర్, తిప్పర్తి యాదయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.