సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ద్వంద్వ ప్రయోజనాలతోపాటు సమస్యలు ఉన్నాయని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ (హెచ్హెచ్ఎఫ్) సర్వేలో తెలిసింది. పబ్లిక్ హెల్త్ ఎన్జీవో అయిన హెచ్హెచ్ఎఫ్ వలంటీర్లు రెండు వారాల పాటు నగరానికి దక్షిణంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద ఈ సర్వే నిర్వహించారు. ఈ పథకం అమలు కాకముందు ఎక్కువగా ఓల్డ్సిటీ నుంచి 52శాతం మంది బస్సుల్లో ప్రయాణించేవారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 81శాతానికి పెరిగినట్లు సర్వేలో వెల్లడించారు. 15 శాతం మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడైంది.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ఏరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య 10 నుంచి 15 శాతం మధ్య పెరిగిందని తెలిసింది. 71 శాతం మంది మహిళలు ఓపీడీ కన్సల్టేషన్కు, 18శాతం మంది ప్రసూతి సంరక్షణకు, 11శాతం మంది ఇతర కారణాల వల్ల వైద్యశాలలకు వెళ్లినట్లు తేలింది. అయితే బస్సు సర్వీసులు సరైన సమయంలో రావడం లేదని మహిళలు ఫిర్యాదులు చేశారు. మరోపక్క మహిళల రద్దీ పెరిగి బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని రిపోర్టు పేర్కొన్నది. ఈ సర్వే 15 రోజుల్లో 3530 మంది మహిళలతో మాట్లాడి రిపోర్టును రూపొందించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.