సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కరోనా తర్వాత తీవ్రంగా పరిణమిస్తున్న తుంటి సమస్యలు- వాటి పరిష్కారాలపై గాంధీ దవాఖానలో మృతదేహంపై జరిగిన వర్క్షాప్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. గాంధీ దవాఖానకు చెందిన ఆర్థో సర్జన్ విభాగానికి చెందిన వైద్యులు, వైద్యవిద్యార్థులతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్థో వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ వర్క్షాప్లో ఉత్సాహంగా పాల్గొని, మృతదేహంపై తుంటి సమస్యలకు సంబంధించిన కారణాలు, వివిధ అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
కొవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పెరుగుతున్న తుంటి సమస్యల నేపథ్యంలో ‘హిప్ మాస్టర్ సైంటిఫిక్, టోటల్ హిప్ బేసిక్ టు అడ్వాన్డ్స్, హిప్ రివిజన్ అనే అంశాలపై శనివారం గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఆదివారం గాంధీ హాస్పిటల్లో జరిపిన కాడవర్ వర్క్షాప్తో ముగిసింది. ఈ సందర్భంగా కిమ్స్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ.. తుంటిలో రక్తప్రసరణ తగ్గిపోవడం లేదా తుంటిలో కొన్ని చోట్ల రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల ‘ఏ వాస్యులర్ నెక్రొసీస్ (ఏ వీ ఎన్) సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు.
అయితే, ఈ కేసులు కరోనా తర్వాత విపరీతంగా పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం మోతాదుకు మించి మందుబిల్లలు, స్టేరాయిడ్స్ వాడకమేనని తెలిపారు. దీనికి తోడు పొగ, మద్యం సేవించిన వారిలో తుంటి సమస్యలు మరింత తీవ్రంగా కనిపిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి సమస్యలకు ‘బోన్ మ్యారో యాస్పరెట్ స్టెమ్ సెల్ థెరపీ కాంసెంట్రేషన్’ ‘ప్లేట్ లెట్ రీచ్ ప్లేజ్మా , స్టెమ్ సెల్ థెరపీ వంటి అధునాతన చికిత్సా పద్ధతులతో చెక్ పెట్టవచ్చని గాంధీ మార్చురీలో మృతదేహంపై నిర్వహించిన వర్క్షాప్లో వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆర్థో వైద్యనిపుణులు డాక్టర్ రవీందర్, ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెండ్ డాక్టర్ మూర్తి, గాంధీ వైద్య విద్యార్థులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన 300 మంది వైద్యనిపుణులు, ఆర్థో విభాగం వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.