Social Media | సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్ పోలీసులు సోషల్మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదకారి. ఈ నేపథ్యంలోనే సోషల్మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు సోషల్ మీడియా యాక్షన్ టీమ్(స్మాష్) పర్యవేక్షిస్తుంది. ప్రశాంతతను భంగం కల్గించే పోస్టులను గుర్తించి వాటిని వెంటనే తొలగించడంతో పాటు పోస్టు చేసిన వారిని పట్టుకుంటున్నారు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవ ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు 20 వేలకుపైగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. పటిష్టమైన బందోబస్తును, పీస్ కమిటీ సమావేశాలతో ప్రజల్లో ఐక్యత చెదరకుండా చేస్తూ సోదర భావంతో వేడుకలు పూర్తయ్యే విధంగా చేస్తుంటారు. కాని కొందరు తప్పుడు వార్తలు సోషల్మీడియాలో పోస్టు చేస్తూ వాటిని సర్క్యూలేట్ చేసి, ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా, అలాంటి వాటితో శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో సోషల్మీడియాపై పోలీసులు నిరంతరం ఫోకస్ పెడుతున్నారు.
పండుగల వేళ..
వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండేలా సిబ్బందికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్మీడియా ఫ్లాట్ ఫామ్లలో వచ్చే ప్రతి పోస్టును స్క్రూటినీ చేస్తున్నారు. సైబర్క్రైమ్, టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు ఈ పండుగల వేళ సోషల్మీడియాలో వచ్చే పోస్టులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అభ్యంతకర పోస్టులను పరిశీలిస్తూ ప్రజల మధ్య వివాదాలు సృష్టించే విధంగా ఉంటే కేసులు నమోదు చేసి ఎక్కడున్న పట్టుకొస్తున్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, ఎదైనా సందేహాముంటే పోలీసులతో నిర్ధారణ చేసుకోవాలని ప్రజలకు చెబుతున్నారు. ఇప్పటికే పీస్ కమిటీలు, ఉత్సవ కమిటీలు, మండపాల కమిటీలో ఆయా స్థాయిలో పోలీసులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పీస్ కమిటీలోను సోషల్మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సభ్యులను చేర్చుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల దృష్ట్యా..
వినాయక నిమజ్జనోత్సవం పూర్తిగా కాగానే ఎన్నికల బందోబస్తుపై పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఒక పక్క గణేశ్ చవితి బందోబస్తుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే వచ్చే ఎన్నికల బందోబస్తుకు కూడా సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీల్లో సోషల్మీడియా అత్యంత ప్రాధాన్య భూమిక పోషిస్తున్నది. పార్టీలు, నాయకులు, ఒకరిపై ఒకరు ధూషణలు, అసభ్యకరమైన పోస్టింగ్లు సోషల్మీడియాలో సర్క్యులేట్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి తావు లేకుండా ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సోషల్మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని దిక్కరిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రశాంతతకు భంగం కల్గించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.