బేగంపేట్, సెప్టెంబర్ 30: అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం బేగంపేట పాటిగడ్డలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో 3వ విడత ఆన్లైన్ డ్రాలో ఎంపికైన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 9600 కోట్ల రూపాయల వ్యయంతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిందని వివరించారు. మొట్ట మొదటగా ఈ కార్యక్రమం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని ఐడీహెచ్ కాలనీలోనే ప్రారంభమైందన్నారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను ఎంతో పారదర్శకంగా రాజకీయ జోక్యం లేకుండా అందిస్తున్నట్టు వివరించారు.
మొదటి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13200 మందికి ఇండ్లను పంపిణీ చేశామన్నారు. మూడో విడతలో నిర్వహించిన డ్రాలో 36,884 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరికి అక్టోబర్, 2,5 తేదీల్లో ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వాలు వివిధ పథకాల పేరుతో పేదల కోసం ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే ఆర్థిక సహాయం అందించేదని, ఆ ఇండ్లు కూడా ఎంతో ఇరుకుగా ఉండేవని గుర్తుచేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు పేదింటి ఆడపడుచు పెండ్లికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్, డి పోచంపల్లి, నిజాంపేటల్లో అక్టోబర్ 2 5న ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఈ సమావేశంలో తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, లక్ష్మి, హేమలతా, మాజీ కార్పొరేటర్లు తరుణి, అరుణగౌడ్, రూప తదితరులు పాల్గొన్నారు.