సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి రంగాలు బాగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధాన పరమైన నిర్ణయాల వల్ల తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతూనే ఉన్నాయి. దేశ విదేశాలకు చెందిన యువత ఇక్కడ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుకూలంగా ఉండేలా సిలబస్ను సరికొత్తగా రూపొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో టీహబ్, విహబ్ వంటి స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తుండటంతో ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న యువతకు కూడా కొత్త ఆవిష్కరణలు అందించాలన్న లక్ష్యంతోనే డిగ్రీ కోర్సుల్లో మార్పులు చేస్తున్నారు. అయితే బీఎస్సీ, బీకామ్, బీఏ వంటి కోర్సుల సిలబస్లో మార్పులు చేయడానికి ఓయూ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సిలబస్ కమిటీ ఏర్పాటవుతోంది. అలాగే సబ్జెక్టుల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో అన్ని సంప్రదాయ యూనివర్సిటీల్లో కూడా సిలబస్లో మార్పులు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మాగాంధీ వంటి పలు యూనివర్సిటీల్లో డిగ్రీ స్థాయిలో సిలబస్ మార్పులు చేయడం కోసం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన పలు యూనివర్సిటీల నుంచి సహకారం పొందుతున్నారు. ఈ విషయంలో బ్రిటిష్ కౌన్సిల్ అధికారుల భాగస్వామ్యంతో డిగ్రీలో సిలబస్ రూపకల్పన కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, బ్రిటిష్ కౌన్సిల్, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్క్షాపు నిర్వహించారు. సిలబస్లో మార్పులు తెచ్చేందుకు మేధోమధనం చేశారు. పరిశోధనలకు సహాయపడేలా ఉండేలా సిలబస్తో పాటు ఉద్యోగం చేయడానికి పనికొచ్చే విధంగా సిలబస్ రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.