బన్సీలాల్పేట్, ఏప్రిల్ 18 : భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లో పురాతన వారసత్వ సంపద, నీటి సంరక్షణ, సంస్కృతి ఔన్నత్యాన్ని అద్భుతంగా వివరించడం జరిగిందని సుధారెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ చైర్పర్సన్ పి.సుధారెడ్డి అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బన్సీలాల్పేట్లోని మెట్ల బావి వద్ద గురువారం సాయంత్రం ‘హెరిటేజ్ వాక్’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి శైలజా రామయ్యర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలో సాలార్జంగ్ మ్యూజియంలోని నాణెల విభాగాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. బన్సీలాల్పేట్లోని పురాతన మెట్లబావిని ఎంతో శ్రమించి పునరుద్ధరించడం వలన పరిసరాలలో భూగర్భ జలాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. అనంతరం పరంపర సంస్థ కళాకారుల ద్వారా ‘షన్మత’ సందేశాత్మక, నృత్య రూప ప్రదర్శన అందరినీ అలరించింది.