సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపారి క్లిక్ చేశాడు. దీంతో ఒక టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్లాడు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో అద్భుతాలు సాధించవచ్చని, ట్రేడింగ్తో రోజు రోజు లాభాలు వస్తున్నాయని, తమకు ఈ రోజు భారీ లాభం వచ్చిందంటూ సైబర్నేరగాళ్ల గ్రూప్ సభ్యులే ఆ గ్రూపులో చర్చించుకుని కొత్తవాళ్లను మభ్యపెడుతున్నారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు తాను కూడా కొంత పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాడు. నేరగాళ్లు బాధితుడికి మరో లింక్ను పంపించి, ఒక యాప్ను డౌన్లోడ్ చేయించారు.
అందులో స్క్రీన్పై పెట్టుబడి, లాభాలు కనిపిస్తుంటాయి. ఇలా ముందుగా తక్కువ మొత్తంలో ఆ యాప్ నుంచి బియాన్స్ను కొనుగోలు చేయడం, కొద్ది సేపట్లో తాము ట్రేడింగ్ చేశామని, లాభం వచ్చిందంటూ నిందితులు నమ్మించి బాధితుడికి ఆ లాభాలు బదిలీ చేయడం చేశారు. దీంతో వారిపై మరింత నమ్మకం పెరిగింది. ఆ తరువాత ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడుతూ యూఎస్డీటీ కరెన్సీని కొనుగోలు చేస్తూ వెళ్లాడు. అయితే, ఆ యాప్ ద్వారా కొనుగోలు చేయడంతో ఆ కరెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలు నేరగాళ్ల చేతిలోనే ఉంటాయి.
దీంతో యూఎస్డీటీని బాధితుడు కొనుగోలు చేస్తుండటం, దానిని సైబర్నేరగాళ్లు ఇతరులకు తిరిగి అమ్మేస్తూ వెళ్లారు. అయితే, స్క్రీన్పై మాత్రం లాభాలు వస్తున్నాయంటూ డిజిటల్ రూపంలో సూచిస్తూ వెళ్లారు. అవి డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో మరికొంత పెట్టుబడి పెడితే డ్రా చేసుకోవచ్చంటూ దఫ దఫాలుగా అతడితో రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.