ఆర్కేపురం : ఆధునిక ప్రపంచంలో ఆత్మస్థెర్యంతో మహిళలు ముందుకు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెండరేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని కిన్నెర గ్రాండ్ హాల్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ , రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ పేద వైశ్యులకు అండగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలవటం అభినందనీయమని పేర్కొన్నారు. ఏ రంగంలో ప నిచేసినా మహిళలు రాణిస్తున్నారని, నేల నుండి ఆకాశంలో విమానాలు నడిపే వరకు మహిళలు దూసుకు పోతున్నా రన్నారు. తెలంగాణలో నేడు మహిళలు ధైర్యంగా బయట తిరగాటానికి షీ టీమ్ లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.
స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు నామినేటేడ్ పదవల్లో, పోలీస్ నియామకాల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ మహిళ బంధుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఎమ్మె ల్సీ వాణీదేవి మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు మారాయని, సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులేనని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లోనూ అందరికీ సమానంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మహిళా ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పు రావాలని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. పేద మహిళ పెండ్లికి పుస్తె, మెట్టలు, పట్టుచీరను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.