Tank Bund | ‘ఓవైపు ఉసేన్ సాగర్.. జలపాతం సవ్వడులు.. మరోవైపు అమరుల త్యాగాలను స్మరిస్తూ..వెలుగులు విరజిమ్మే స్మారక స్థూపం.. ఇంకోవైపు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉండే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. వీటితో పాటు ఆధునిక హంగులతో అద్భుతంగా నిర్మించిన పరిపాలనా సౌధం రాష్ర్టానికే తలమానికంగా దర్శనమిస్తున్నది. సీఎం కేసీఆర్ విజన్తో రూపుదిద్దుకున్న సచివాలయం నేడు ప్రారంభం కాబోతున్నది. కళ్లు చెదిరిపోయే కట్టడం..కలలో కూడా ఊహకందని అసాధారణ నిర్మాణాలపై పలువురి అనుభవాలు, అనుభూతులను వారి మాటల్లోనే విందాం..
– సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ నడిబొడ్డున అందమైన అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞప్తికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబేద్కర్ నెలకొల్పింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను చూడలేదు. కానీ..విగ్రహ రూపంలో ఉన్న అతిపెద్ద విగ్రహాన్ని చూస్తుంటే కండ్లెదుటే అంబేద్కర్ నిలిచినట్లు భావన కలుగుతున్నది. స్మృతి వనం పర్యాటకంగా అలరించనుండగా.. విగ్రహం కింద ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించిన ఫొటో గ్యాలరీ యువతకు మార్గదర్శకంగా నిలవనుంది.
– శ్రీజశ్రీ, సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైదరాబాద్
భారతదేశమే గర్వించదగ్గ విధంగా సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ నామకరణం చేసి, అన్ని హంగులతో నిర్మించి నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించడం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోనె ప్రదీప్రావు అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉండే విధంగా వినూత్న హంగులతో నిర్మించడం సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మరోసారి తగిన గుణపాఠం చెప్పి, బీఆర్ఎన్ను అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలను కోరారు.
– బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోనె ప్రదీప్రావు
తెలంగాణ ఆత్మగౌరవ ప్రగతి ప్రతీకగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం చరిత్రలో నిలిచిపోతుందని విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆదివారం సకల సౌకర్యాలతో నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఖ్యాతిని సచివాలయం నలు దిశలా ప్రసరింపచేయటం తథ్యమని, దేశానికే ఈ పరిపాలనా భవనం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం యావత్తు ఒకే చోట లభించేలా అన్ని వసతులతో భవనాన్ని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అత్యంత తక్కువ సమయంలో ఇంతటి భారీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయటం ద్వారా సీఎం కేసీఆర్, ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని విప్ పేర్కొన్నారు.
– ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసినరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం గురించి అందరూ గొప్పగా చెబుతుంటే చూద్దామని వచ్చాను. కృష్ణా జిల్లా నుంచి నాతోపాటు చాలామంది వచ్చారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం ఇంకా కార్యరూపంలోకి రాలేదు. తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన పనులు చేపట్టి దేశంలోనే అతి పెద్ద విగ్రహంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దింది. గొప్ప సంకల్పంతో ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయం. హుస్సేన్ సాగర్ ఒడ్డున మరో సందర్శనీయ స్థలంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తున్నది.
– జి.తిరుమలరావు, న్యాయవాది, కృష్ణా జిల్లా
హుస్సేన్ సాగర్ చుట్టూత ఉన్న ప్రాంతాన్ని సుందర పర్యాటక కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్కు, జల విహార్, పీవీ ఘాట్, థ్రిల్ సిటీ వంటివి సందర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలతో సాగర తీరానికి కొత్త శోభ వచ్చింది. వేసవి సెలవులు రావడంతో టూర్లో భాగంగా అదిలాబాద్ నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాద్కు వచ్చాం. అంబేద్కర్ విగ్రహం, నూతన సచివాలయం నిర్మాణాలు అత్యద్భుతం. ఇవి మంచి అనుభూతిని మిగిల్చాయి.
– రాజశేఖర్, బిజినెస్ మ్యాన్, అదిలాబాద్
అంబేద్కర్ విగ్రహం, సచివాలయం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంత అద్భుత కట్టడాలు ఇక్కడే సాధ్యం. ప్రత్యేకించి వీటిని చూడటానికే మేం వచ్చాం. నగర ప్రజలు చాలా లక్కీ. ఒక్క ట్యాంక్బండ్ వస్తే అనేక రకాల పర్యాటక ప్రాంతాలను వీక్షించొచ్చు. ఓవైపు ఐమ్యాక్స్, మరోవైపు పార్కులు, ఇంకోవైపు బోటింగ్, ఫుడ్కోర్టులు ఇలా అన్ని రకాలుగా అనుభూతులను పంచే ప్రాంతం ఇది.
– నయన్, పుణె