కాచిగూడ, ఏప్రిల్ 29 : ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఎస్సైని ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి చాకుతో బెదిరించిన కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక రైల్వే పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మైలార్దేవ్పల్లికి ప్రాంతానికి చెందిన డి.ప్రసాద్ వెస్ట్బెంగాల్ డార్జిలింగ్లోని సీఆర్పీఎఫ్లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి సికింద్రాబాద్- ఫలక్నామ ఎంఎంటీఎస్ రైల్లో వెళ్తుండగా.. యాకుత్పుర రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని 4 దుండగులు రైల్లోకి ప్రవేశించి, ఎస్సైను చాకుతో బెదిరించారు. అతడి వద్దనున్న 2.5 తులాల బంగారు గొలుసు, రూ.700 నగదు, 2 సెల్ఫోన్లను లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంటనే దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.. ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు.. నేరం జరిగిన సమయంలో వెళ్తున్న నలుగుర్ని గుర్తించారు.
వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, నిందితుల ముఖాలు సీసీ పుటేజీల్లో స్పష్టంగా కనిపించకపోవడంతో కొంత ఇబ్బందిగా మారినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. దుండగులకు సంబంధించిన సమాచారం ఉంటే 87126 58584, 8712658620 నంబర్లకు ఫోన్ చేసి ఇవ్వాలని కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ కోరారు.