కందుకూరు, నవంబర్ 16 : మండల పరిధిలోని చిన్న గ్రామ పంచాయతీలు ప్రగతిలో పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రజల సౌలభ్యం కోసం 500 జనాభా ఉన్న చిన్న గ్రామాలను గుర్తించి పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మండలంలోని గిరిజన తండాలతో పాటు సరస్వతీగూడ, బైరాగిగూడ, బేగరికంచె, జబ్బారుగూడ, అన్నోజిగూడ, దన్నారం, కొలనుగూడ గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. పంచాయతీలుగా ఏర్పడిన అనంతరం సర్పంచ్లు రాము, వాసవీ రేఖ, సుగుణమ్మ, ఇందిరమ్మ, శ్రీదేవి శేఖర్రెడ్డి, సరళమ్మ, ఉప సర్పంచ్లతో పాటు పాలకవర్గం సభ్యులు కలిసి సమష్టిగా గ్రామాల్లో కావాల్సిన పనులను గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు. దీంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిరంతరం అభివృద్ధి కోసం పని చేస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి సహకారంతో నిధులు తీసుకొస్తున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి గ్రామానికి కావాల్సిన నిధులను అధికారులతో సంప్రదించి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు, శ్మాశన వాటిక నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. మొదటి సారిగా పంచాయతీగా ఏర్పడటంతో తమ గ్రామాలను ఆదర్శంగా ఉండాలని కృషి చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పరుగులు..
పల్లె ప్రగతి కార్యక్రమం అధికారుల్లో కదలిక, ప్రజల్లో చైతన్యం తెచ్చింది. దీంతో గ్రామాలు బాగుండాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా పల్లె ప్రగతి వైపు అడుగులు వేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మండలంలో గుర్తింపు తీసుకువస్తా. పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఉప సర్పంచ్ కవిత, వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో పని చేయడంతో అధికారులు ఆదర్శ గ్రామంగా ఎంపికచేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాను. ప్రభుత్వం గ్రామాలకు మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేయడానికి కృషి చేస్తా.
వేగంగా అభివృద్ధి..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాను. పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను పూర్తి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులందరి సమన్వయంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతినెల ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నాను.
సంతోషంగా ఉంది..
సీఎం కేసీఆర్ చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం. పంచాయతీలకు కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దశలవారీగా చిన్న గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రౌండ్ డ్రైనేజీ, శ్మశాన వాటిక, స్నానాల గదులు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి చేశాం.