సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): గులాబీ పార్టీలో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఎన్నికల జోష్లో నిమగ్నమయ్యారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సాధించిన ప్రగతితో మరోసారి హ్యాట్రిక్ సాధించి గులాబీ జెండాను ఎగురవేసేందుకు సమయత్తమవుతున్నది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించుకున్నామని, గెలుపు నల్లేరు మీద నడకేనని పార్టీ శ్రేణులు చెబుతుండటం గమనార్హం. గ్రేటర్లో మెజార్టీ సీట్లలో సిట్టింగులకే చోటు దక్కడంతో నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్నంటాయి. సిటీలో ఉదయం నుంచే నియోజకవర్గ పార్టీ కార్యాలయాలన్ని సంబురాలకు నేతలు ఏర్పాటు చేశారు. గ్రేటర్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధే ప్రధాన అజెండగా బీఆర్ఎస్ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు.. బీజేపీకి క్యాడర్ లేదు.. వారిని నమ్మి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరు. మూడోసారి కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కుత్బుల్లాపూర్లో గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి తన గెలుపునకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు బ్రహ్మాండగా తన గెలుపునకు బ్రహ్మరథం పడుతారు. కుత్బుల్లాపూర్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.
– కేపీ వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
సీఎం నమ్మకాన్ని వమ్ము చేయను..
అసెంబ్లీ టిక్కెట్టును ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్బీనగర్లో ఘన విజయం సాధిస్తా. పేద, అట్టడుగు వర్గాలపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, ఆదరణ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ పంచేలా పనిచేస్తా. కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, మిగిలిపోయిన సమస్యలను రాబోయే రోజుల్లో తీర్చి ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సదుపాయాలు కల్పిస్తా. ఈ ఎన్నిక కాంగ్రెస్, బీజేపీపై గెలువాలని కాదు.. ఈ ఎన్నిక రాబోయే తరానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలన్నది నా బలమైన ఆకాంక్ష. ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలు మార్చే ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టాను. రాబోయే 2024 నుంచి ఆ పనులు మొదలవుతాయి. రెండేళ్ల కరోనాతో అభివృద్ధి కొంచం చతికిల పడ్డా, 2022-23లో పుంజుకున్నది. భవిష్యత్తులో ఎల్బీనగర్ను అన్ని నియోజకవర్గాలకు రోల్మోడల్గా తీర్చిదిద్దుతా.
– దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
ఊపిరి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా
గడిచిన 15 ఏండ్లుగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కరమే ప్రధాన ధ్యేయంగా నిరంతరం పాటుపడుతున్నా. నా సేవలను గుర్తించిన సీఎం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ఖరారు చేయడం సంతోషం. సీఎం కేసీఆర్కు ఊపిరి ఉన్నంత వరకు రుణపడి ఉంటా. ప్రజల కోసమే నా జీవితం అంకితం. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి పర్చడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ ఉంది. మూడోసారి బీఆర్ఎస్ సర్కారు అధికారం చేపట్టడం ఖాయం.
– ప్రకాశ్గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధే ఆయుధం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఐదేళ్లుగా పనిచేయడం ఎంతో గొప్ప అనుభవం. ఆయన దూరదృష్టితోపాటు తెలంగాణ ప్రజలపై ప్రేమను దగ్గరగా చూశాను. మరోసారి నాకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారీ మెజార్టీతో విజయం సాధించి కానుకగా అందజేస్తా. గత తొమ్మిదేళ్లుగా రా్రష్ట్రం సాధించిన అభివృద్ధితోపాటు పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఆయుధంగా రానున్న ఎన్నికల సమరంలోకి దిగనున్నాం. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధితోపాటు ప్రజలకు అందుబాటులో ఉండటం మరోసారి అవకాశం దక్కిందని భావిస్తున్నా. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సాధించిన 30వేల మెజార్టీని దాటడం ఖాయం.
– దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా
నాపై ఉన్న నమ్మకంతో ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు కృతజ్ఞతలు. ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకొనిపోతా. గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీలో చేరి, పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశా. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్నాను. ప్రజల ఆశీర్వాదంతో ఉప్పల్ నియోజకవర్గంలో లక్ష మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేస్తా. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా. – బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి
మెజార్టీ ఓట్లు సాధిస్తా..
నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. తన సేవలు, పని తీరును గుర్తించి సీఎం కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ మూడోసారి టికెట్ ఇచ్చిననందుకు సంతోషంగా ఉంది. నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజల మధ్య ఉంటూ, గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు ఓట్లు సాధిస్తాను. ముషీరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తా. ఆర్టీసీ క్రాస్, ఇందిరాపార్కు, అశోక్నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను పలుమార్లు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రతిష్టాత్మకమైన స్టీలు బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశాను.
– ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే
మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తా..
నాపై నమ్మకంతో రెండోసారి అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉండటమే కాకుండా సీఎం నమ్మకాన్ని నిలబెడుతా. రెండోసారి కూడా అంబర్పేట గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తా. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. అవతలి పార్టీల నుంచి ఏ అభ్యర్థి ఉన్నా అంబర్పేటలో గులాబీ జెండాదే విజయం.
– కాలేరు వెంకటేశ్, అంబర్పేట ఎమ్మెల్యే