బంజారాహిల్స్, జూన్ 14: నంబర్ ప్లేట్ లేకపోవడంతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాంగ్రూట్లో వెళ్తూ కారును ఢీకొట్టిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన ప్రకాశ్, ఫరీద్, కిరణ్ మంగళవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వైపు నుంచి తెలంగాణ భవన్ వైపు స్కూటీపై వెళ్తున్నారు. తెలంగాణ స్టడీ సర్కిల్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న విషయాన్ని స్కూటీ నడిపిస్తున్న ప్రకాశ్ గమనించాడు.
స్కూటీకి నంబర్ ప్లేట్ లేకపోవడంతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. హెల్మెట్ కూడా లేకపోవడంతో తమను ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారని భావించిన ప్రకాశ్.. స్కూటీని వెనక్కి తిప్పాడు. రాంగ్రూట్లో అతివేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్న రేంజ్ రోవర్ కారును ఢీకొట్టాడు. దీంతో కారు నడిపిస్తున్న తార్నాక ప్రాంతానికి చెందిన అర్బాజ్ ఫారూఖీ ఒక్కసారిగా షాక్కు గురై బ్రేకులు వేశాడు. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ప్రకాశ్ కాలు విరగ్గా.. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రేంజ్ రోవర్ కారు యజమాని అర్బాజ్ ఫారూఖీ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.