సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): సెకండ్ వేవ్లో చిన్నారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. పెద్దల మాదిరిగానే వారికీ కరోనా తదనంతర సమస్యలు వేధిస్తున్నాయి. ప్రతి 100 మంది పిల్లల్లో 10 మంది పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్టు కరోనాలో మల్టీ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ (ఎంఐఎస్-సీ)కు దారితీస్తున్నదని, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రధాన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకుంటే..దీనిని సులువుగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పీడియాట్రిషియన్లు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పిల్లల్లో కరోనా ప్రభావం తక్కువే. 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అయితే వైరస్ వచ్చిపోయిన 3 నుంచి 6 వారాల తర్వాత ఎంఐఎస్-సీ సమస్యలు అధికంగా ఉండే అవకాశాలున్నాయని, దీనివల్ల ప్రధాన అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి వేవ్ కంటే.. రెండో దశలోనే చిన్నారులు ఎక్కువగా వైరస్ బారినపడ్డారని, దీంతో పాటు ఎంఐఎస్-సీ కేసులు సైతం అధికంగానే నమోదవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో, దీర్ఘకాలిక సమస్యలు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్న చిన్నారుల్లో హైపర్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అనే రియాక్షన్స్ ఏర్పడి, ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతున్నారని, సకాలంలో చికిత్స అందించకపోతే ప్రమాదమని నిలోఫర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత పిల్లల్లో పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జ్వరం, వాంతులు, విరేచనాలు, శరీరంపై, పాదాలపై వాపు, ఎర్రటి చిన్నపాటి కురుపులు వంటివి ఏర్పడుతాయి. మూడు నుంచి ఐదురోజులు దాటినా.. జ్వరం, వాంతులు విరేచనాలు తగ్గకపోయినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరికొందరు పిల్లల్లో కళ్లు ఎర్రబడడం, గొంతుకింద వాపు, ఆయాసం, బీపీ, పల్స్రేట్ తగ్గిపోవడం, కళ్లు తిరిగి పడిపోవడం, తీవ్ర నీరసానికి గురికావడం వంటివి సంభవిస్తున్నాయని, ఇది ప్రమాదకర దశగా గుర్తించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు పిల్లల వైద్యులు.
పోస్టు కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైన టెస్టులు చేయించాలి. చాలా మంది పిల్లల్లో కరోనా వచ్చిపోయినట్లు తెలియడం లేదు. కానీ వైరస్ వచ్చిపోయిన నెలరోజుల తరువాత వారిలో ఎంఐఎస్-సీ లక్షణాలు బయటపడుతున్నాయి. ప్రతి 10 మంది పిల్లల్లో ఇద్దరు ముగ్గురు ఈ పోస్టు కరోనాకు గురవుతున్నారు. ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చి ఉండి, కొన్ని రోజుల తరువాత పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే ఎంఐఎస్-సీతో ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గాంధీ దవాఖానలో ముగ్గురు పిల్లలు ఎంఐఎస్-సీ లక్షణాలతో, కరోనాతో 14 మంది చిన్నపిల్లలు, 12 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. – డాక్టర్ సుచిత్ర, చిన్నపిల్లల వైద్యనిపుణురాలు, గాంధీ దవాఖాన