మణికొండ: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. మూడురోజులుగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. ఒకవైపు కూల్చివేతలు జరుగుతుంటే.. కొందరు బిల్డర్లు ప్రభుత్వంలోని పెద్ద మనుషులను కలిసి వారి ద్వారా కూల్చివేతలు చేపట్టకుండా ఒత్తిళ్లు తెస్తున్న పరిస్థితి ఉంది. అయినా అధికారులు లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శనివారం పంచవటికాలనీ, అల్కాపూర్ టౌన్షిప్ బిగోనియా సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
అల్కాపూర్ టౌన్షిప్, హనుమాన్నగర్కాలనీ, హుడాకాలనీ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించామని, వాటిని సైతం కూల్చివేస్తామని తెలిపారు. కొన్నిచోట్ల అక్రమ నిర్మాణాలను నిర్మించి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పలువురు బిల్డర్లు యత్నిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు పాల్పడే ప్రసక్తే లేదని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. కాగా, పంచవటికాలనీలో సుమారు 2300 గజాల్లోని నిర్మాణాలకు తప్పుడు పత్రాలను సృష్టించి అనుమతులను పొందినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే భవనంలో 72పైగా ప్లాట్లు నిర్మించడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమైనా.. సదరు బిల్డరు తొమ్మిది నక్షత్రాలు నిర్మిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ సినీ హీరోపేరిట ఉన్న ఆ డాక్యుమెంటుకు ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకపోవడం, 2010లో అప్పటి మణికొండ గ్రామపంచాయతీలో పొందిన ఎల్ఆర్ఎస్ను చూపి, తప్పుగా మార్టిగేజ్ పత్రాలను సృష్టించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.