సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ) : సుస్థిరమైన, పర్యావరణహితమైన బ్యాటరీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా రసాయనిక వైజ్ఞానిక రంగంలో పరిశోధన సేవలు అందిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాటరీల తయారీ కంపెనీ లుమినస్ పవర్ టెక్నాలజీస్, ఐఐసీటీతో శుక్రవారం చేతులు కలిపింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ బ్యాటరీలను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి.
పర్యావరణహితమైన, భూమిపై సమృద్ధిగా దొరికే పదార్థాలతోనే బ్యాటరీల తయారీపై గతకొంతకాలంగా ఐఐసీటీ పరిశోధనలు చేస్తున్నది. ఆధునిక వైజ్ఞానిక రసాయన సాంకేతికత సాయంతో తర్వాతి తరం బ్యాటరీలను ఆవిష్కరించేందుకు ఐఐసీటీ కృషి చేస్తున్నది. రానున్న రోజుల్లో గృహ, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా పర్యావరణానికి అనుకూలమైన బ్యాటరీల వినియోగం పెరగనుంది. దీంతో రీచార్జబుల్ అల్యూమినియం బ్యాటరీలను ఐఐసీటీ పరిశోధకులు పైలట్ ప్రాజెక్టుగా ఆవిష్కరించారు. ఇకపై వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే విధంగా ఐఐసీటీ టెక్నాలజీని అందించనుంది. దీంతో దేశంలోనే ప్రముఖ బ్యాటరీల కంపెనీ సంస్థ అయిన లుమినస్ బ్యాటరీ కంపెనీ దేశీయ పరిజ్ఞానంతో ఆధునిక రీచార్జబుల్ అల్యూమినియం బ్యాటరీలను ఐఐసీటీ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, లుమినస్ పవర్ టెక్నాలజీస్ ఎండీ ప్రీతి బజాజ్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డా.డి. శైలజ, సైంటిస్టులు డా.వత్సల రాణి, డా. ప్రత్యాయ్ బాసక్, తదితరులు పాల్గొన్నారు.