మియాపూర్(హైదరాబాద్) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Gandhi) అన్నారు. వాటి అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రజలతో కలిసి పోరాడుతామని పేర్కొన్నారు. హ్యట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన గాంధీని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, కాలనీ సంఘాల ప్రతినిధులు గురువారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ఏడాదికి 330 రోజులు పని చేశానని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గానికి అధిక నిధుల సాధనకు ప్రస్తుత ప్రభుత్వంతో పోరాడుతానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తిరిగి వారి సేవలోనే తరిస్తానని ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు. ప్రజల గొంతుకై పని చేస్తానని, విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోనని ఆయన స్పష్టం చేసారు.