రవీంద్రభారతి : రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ (Lambadis) శాసన సభ్యులకు మంత్రి(Minister ) పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు నరసింహానాయక్ (Narasimha Nayak) ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
శనివారం బషీర్బాగ్లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం .. లంబాడిల ఆత్మగౌరవాన్ని పెంచుతామని చెప్పి ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి లంబాడీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. లంబాడీల కంటే జనాభా తక్కువ ఉన్న ఓ వర్గానికి ఐదు మంత్రి పదవులు, 20కిపైగా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారని, 10 శాతం ఉన్న లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం లంబాడీ జాతిని అవమానించడమేనని అన్నారు.
60 నియోజకవర్గాలలో అత్యధికంగా లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన లంబాడీలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR) మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించారని, చందులాల్, సత్యవతి రాథోడ్కు చోటు కల్పించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. కేసీఆర్ హాయంలో లంబాడీలకు స్వర్ణయుగంగా ఉండేదని స్పష్టం చేశారు. మాయమాటలు చెప్పి ఓటువేసినందుకు లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు.