Stray Dogs | సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వెటర్నరీ విభాగం అధికారులతో కలిసి అర్వింద్కుమార్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఐదున్నర లక్షల వీధి కుక్కలున్నాయని, గతంలో 8 లక్షల 50వేలు ఉండేవని (2011) స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య ఐదు లక్షల 50వేలకు తగ్గిందని అర్వింద్కుమార్ తెలిపారు. వాటికి వెంటనే ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని నీటి నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, చికెన్ , మటన్ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నగరంలో కుక్కల సంఖ్యను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పెంపుడు కుక్కలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అర్వింద్కుమార్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగర, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్లమ్ డెవలప్మెంట్ ఫెడరేషన్స్, టౌన్ డెవలప్మెంట్ ఫెడరేషన్స్ , రెసిడెంట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మెప్మా స్వయం సహాయక బృందాలతో నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక యాప్
పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేయాలని అధికారులకు అర్వింద్కుమార్ సూచించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను ‘మై జీహెచ్ఎంసీ’ యాప్, 040 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుకల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్ యాప్ను కూడా రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ యాప్లో సంబంధిత యాజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని చెప్పారు. ఎకువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు
బండ్లగూడ, ఫిబ్రవరి 22 : రాజేంద్రనగర్ సర్కిల్లోని ఎర్రబోడలో ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై బుధవారం వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గడిచిన రెండు రోజులుగా ఐదుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. సర్కిల్ పరిధిలో హైదర్గూడ, అత్తాపూర్, న్యూఫ్రెండ్స్ కాలనీ, ఎర్రబోడ, రాజేంద్రనగర్, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉన్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.