సిటీబ్యూరో, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): రామఫలం ఆకులతో తయారు చేసిన కాషాయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక్రిశాట్ ఇంటర్న్షిప్లో భాగంగా 17 ఏండ్ల యువ పరిశోధకుడు రూపొందించిన బయో ఇన్సెక్టిసైడ్ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది. కేవలం అటవీ ప్రాంతాల్లోనే కనిపించే రామఫలం ఆకులతో జీవ రసాయన పద్ధతిలో చేసిన క్రిమి సంహారిణి మొండి తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొగలదని నిరూపించింది. ఇటీవల అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్లో దేశం నుంచి సర్వేశ్ ప్రభు పాల్గొన్నారు. ఇందులో రామఫలంతో తయారు చేసిన బయో క్రిమి సంహారిణి ప్రపంచ వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. పోటీల జాబితాలో మూడో స్థానంలో నిలవడంతో పాటు 1000 అమెరికా డాలర్ల ప్రోత్సాహాకాన్ని అందుకున్నారు సర్వేశ్ ప్రభు. గతంలోనూ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డులోనూ మొదటి బహుమతిని పొందారు.
సమర్థవంతంగా..
పంట దిగుబడిని నియంత్రించే ప్రమాదకరమైన మూడు తెగుళ్లపై రామఫలం ఆకులు, చెట్ల బెరడుతో చేసిన బయో ఇన్సెక్టిసైడ్ సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. పాడ్ బోరర్(కాయ తొలుచు పురుగు), పట్టి పీచు పురుగు వంటి తెగుళ్లు, చిక్కుళ్లు, తృణ ధాన్యాలకు వచ్చే తెగుళ్లపై ప్రభావం చూపిందని వీటితో 21-53 శాతం మేర పంట నష్టాన్ని కలిగించే సాధారణ తెగుళ్లను కూడా రామఫలం బయో ఇన్సెక్టిసైడ్ నివారించినట్లుగా ఇక్రిశాట్ వర్గాలు వివరించాయి. సుమారు 700 మంది ఇంటర్న్లు, రీసెర్చ్ స్కాలర్లకు శిక్షణ ఇస్తున్నామని, రైతులకు ప్రయోజనకరమైన ఆవిష్కరణలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఇక్రిశాట్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు.
ఖర్చు తక్కువ..
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రసాయన ఎరువులతో పంట ఖర్చులు పెరగడంతోపాటు సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక భారంగా మారాయి. ఈ క్రమంలో చేతికి వచ్చిన పంటను చేజార్చుకోలేక, దిగుబడిని పెంచుకునేందుకు రసాయనిక క్రిమి సంహార మందులను కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎకరా పంటకు రూ. 800-1000తోనే బయో ఇన్సెక్టిసైడ్తో తెగుళ్లను నివారించేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. తక్కువ వ్యయంతో పర్యావరణహితంగా పంటలు సాగు చేయడానికి రైతులకు లబ్ధి చేకూరుతుందని ఇక్రిసాట్ వర్గాలు చెబుతున్నాయి.