నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండటంతో పలు చోట్ల కౌన్సిలర్లు ప్రస్తుత మేయర్లపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో ఈ నెలాఖరుకు నాలుగు సంవత్సరాలు పూర్తి కానుండటంతో అవిశ్వాసానికి పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగా శివారులోని కీలకమైన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుత మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డిపై సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు కూడా గుర్రుగా ఉన్నారు. అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాల దరిమిలా త్వరలోనే అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చే అవకాశముంది. దీంతో పాటు ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీల్లోనూ ప్రస్తుత చైర్పర్సన్లపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండటంతో ప్రస్తుతం పలుచోట్ల కౌన్సిలర్లు ప్రస్తుత మేయర్లపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో ఈ నెలాఖరుకు నాలుగు సంవత్సరాలు పూర్తి కానుండటంతో అవిశ్వాసానికి పావులు కదులుతున్నాయి.
ఇందులో భాగంగా శివారులోని కీలకమైన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుత మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డిపై సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు కూడా గుర్రుగా ఉన్నారు. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాల దరిమిలా త్వరలోనే తెరపైకి అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముంది. దీంతో పాటు ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీల్లోనూ ప్రస్తుత చైర్పర్సన్లపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అటు విస్తీర్ణంలోనూ ఇటు ఆదాయంలోనూ పెద్దదే. ఇంతటి కీలకమైన కార్పొరేషన్ మేయర్గా ప్రస్తుతం చిగురింత పారిజాత ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో 32 వార్డులు ఉండగా.. ఇందులో 14 స్థానాలను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. బీజేపీ పది స్థానాల్లో గెలువగా, కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలకు పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిగురింత పారిజాత బీఆర్ఎస్లోకి రావడంతో ఆమెకు మేయర్ పదవి దక్కింది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల దరిమిలా తిరిగి ఆమె కాంగ్రెస్ గూటికి చేరింది. దీంతో పాటు ఆమె ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సైతం గుర్రుగా ఉన్నారు. మేయర్పై అసంతృప్తి దావనంలా వ్యాపిస్తుండటంతో అవిశ్వాస తీర్మానానికి బీజం పడింది. బీఆర్ఎస్కు చెందిన 14 మంది కార్పొరేటర్లు ఇందుకు సిద్ధమవుతుండగా.. బీజేపీకి చెందిన పది మంది కార్పొరేటర్లు కూడా ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకొని ఆమెను మేయర్ పీఠం నుంచి దింపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపైనా అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. గతంలోనే కలెక్టర్కు నోటీసు ఇచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తి కానందున అవిశ్వాసానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో నాలుగు సంవత్సరాలు పూర్తయిన వెంటనే అవిశ్వాస మేఘాలు కమ్ముకోనున్నాయి.
ఇక్కడ మొత్తం 24 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ ఏకంగా పదహారు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. రెండు స్థానాలను బీజేపీ దక్కించుకోగా.. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. సంపూర్ణ బలం ఉండటంతో బీఆర్ఎస్కు చెందిన కప్పరి స్రవంతిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో పూర్తిస్థాయి బలమున్న బీఆర్ఎస్ అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసింది. ఈ విషయం ముందుగా తెలియడంతోనే ఇటీవల ఆమె బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో స్రవంతి పార్టీ మారడం, గతంలోనే ఆమెపై కౌన్సిలర్లలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉండటం, తాజా కేసు నేపథ్యంలో ఆమె చైర్పర్సన్ పదవి పోయడం వంద శాతం ఖరారైందని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్పేట మున్సిపల్ రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా తయారైంది. ఇక్కడ 24వార్డులు ఉండగా.. ఇందులో బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ అత్యధికంగా 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ, సీపీఐ చెరో స్థానంతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోవడం బీఆర్ఎస్కు కలిసొచ్చింది. చైర్పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించినందున వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోని కౌన్సిలర్ల మధ్య పోటీ నెలకొంది.
ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మేనల్లుడు మురళీధర్రెడ్డికి వైస్ చైర్మన్ ఇవ్వాలని అప్పట్లో కోమటిరెడ్డి పట్టుబట్టగా.. దీనికి వ్యతిరేకంగా విజయశేఖర్రెడ్డి వర్గం బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో బీఆర్ఎస్కు చెందిన చెవుల స్వప్నకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలుపడంతో చైర్పర్సన్ పీఠం దక్కింది. వైస్ చైర్మన్ విజయశేఖర్రెడ్డి భార్య సంపూర్ణ అయ్యారు. అనంతరం కొద్దికాలానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లలో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పట్ల అసంతృప్తి నెలకొని గత సంవత్సరమే అవిశ్వాసానికి కలెక్టర్కు నోటీసు ఇచ్చారు.
కానీ నిబంధనల ప్రకారం నాలుగేండ్లు కాకపోవడంతో అది అమలులోకి రాలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్ స్వప్న మరో బీఆర్ఎస్ కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాగూ విబేధాలు ఉన్నందున.. గతంలో వైస్ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన మురళీధర్రెడ్డి మరోసారి పావులు కదపడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా చైర్పర్సన్ పదవిని తనకు అనుకూలంగా ఉన్న పండుగల జయశ్రీకి ఇచ్చి, తాను వైస్ చైర్మన్ కావాలని ఆశిస్తున్నారు. దీంతో ఈ నెల 25తో నాలుగేండ్లు పూర్తి కాగానే అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు విజయశేఖర్రెడ్డి వర్గం కూడా సిద్ధమైంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.