తెలుగుయూనివర్సిటీ : ప్రజా ఉద్యమాలకు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు నిబద్దుడినై సాహితీ జీవనయాత్రలో జీవించానని ప్రముఖ కవి నిఖిలేశ్వర్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న పరిణతవాణి లహరి ప్రసంగ కార్యక్రమంలో భాగంగా దిగంబర కవులలో ఒకరైన నిఖిలేశ్వర్ బుధవారం 84వ ప్రసంగం చేశారు.
భువనగిరి సమీపంలోని వీరవల్లిలో 1938లో సాధారణ రైతు కుటుంబలో జన్మించానని తెలిపారు. 6నెలల వయసులోనే తండ్రి చనిపోతే అమ్మ నర్సమ్మ వి.ఎస్.టీ కంపనీలో కార్మికురాలిగా ఎంతో కష్టపడి తనను పెంచి పెద్ద చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్యసమాజం, దైవభక్తి తొలినాటి ప్రభావాలని పేర్కొన్నారు.
అనంతర కాలంలో మార్కిజం అధ్యయనం వల్ల పూర్తిగా మారిపోయానన్నారు. ఆ దశలోనే విరసం, దిగంబర కవితోద్యమంలో పనిచేశానని పేర్కొన్నారు. 1956లో టెలివిజన్ ఎలా పనిచేస్తుంది అనే వ్యాసం గోలకొండ పత్రికలో ప్రచురితమైందన్నారు. నాటినుండి నిరంతరంగా రచనాయాత్ర కొనసాగిస్తున్నానని అన్నారు.
టాల్స్టాయ్, దోస్తోవస్కీ, గోర్కీలాంటి రష్యన్ రచయితల నవలలు చదివానని, బుచ్చిబాబు రచన చివరకు మిగిలేది, గోపిచంద్ నవల అసమర్థుని జీవయాత్ర, ఉన్నవ రచన మాలపల్లి, వట్టికోట రచన ప్రజల మనిషి, చలం రచన మైదానం వంటి రచనలను హిందీలోకి అనువదించాననితెలిపారు.
గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, తిలక్, కుందిర్తి, ఖలీల్జిబ్రాన్ తనలోని అంతర్గత భావచైతన్యాన్ని వెలిగించాయని నిఖిలేశ్వర్ అన్నారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసంలో కవి పండితుల, రచయితల పరిణతవాణి ప్రసంగాలు యువతకు స్పూర్తిదాయకంగా ఉంటాయన్నారు.
సుమారు 80మంది ప్రసంగాలను 8సంపుటాలుగా వెలువరించామని వాటిని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టవలసిన అవసరం ఉందన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, ప్రమఖ సాహితీవేత్త ఆచార్య కాత్యాయినీ విద్మహే తదితరులు పాల్గొన్నారు.