HYDRAA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): హైదరాబద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ దేవరయంజాల్ గ్రామంలోని కోమటికుంటలో కూల్చివేతలను కొనసాగించింది. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అనంతరం గురువారం స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేసింది.
మరోవైపు కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా వెల్లడించింది. మరోవైపు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్లు వెల్లడి కావడంతో కూల్చివేతలకు హైడ్రా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలోనే ఇచ్చిన హైడ్రా నోటీసులపై హైకోర్టును ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు ఆశ్రయించారు.
దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ తీర్పును వెలువరించింది. దీనికి సమాధానంగా తామే తొలగిస్తామని, 30 రోజుల సమయం కావాలని ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును కోరారు. కానీ హైకోర్టు ఇచ్చిన 30 రోజులు గడువు పూర్తయినప్పటికీ నిర్మాణాలను కూల్చివేయకపోవడంతో నేరుగా హైడ్రా రంగంలోకి దిగి గురువారం ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్లను నేలమట్టం చేసింది.