Hydraa | మణికొండ, మే 15: జంటనగరాలకు తాగు నీరు అందించే గండిపేట(ఉస్మాన్సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. రూ. 2 లక్షలు వెచ్చించి బుల్కాపూర్ నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది. వరద వచ్చేటప్పుడు గండిపేటకు చేరేలా కాలువకు ఉన్న షట్టర్లు (గేట్లు) శిథిలమైన విషయం విదితమే. మురుగు నీరు గండిపేటలో కలుస్తున్నదని ఇటీవల నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై హైడ్రా స్పందించింది. అధికారుల బృందంతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెంటనే షట్టర్ల మరమ్మతులను చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
శిథిలమైన షట్టర్ల స్థానంలో కొత్తవి అమర్చడంతో మురుగు నీరు గండిపేట చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే బుల్కాపూర్ నాలాలో పూడికపోయిన చెత్తను కూడా కొంతమేర తొలగించి మురుగు నీరు ముందుకు సాగేలా ఏర్పాట్లు చేశారు. ఒకప్పుడు వరద కాలువగా ఉన్న బుల్కాపూర్ నాలాలో పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు , రిసార్టుల నుంచి మురుగు నీరు ప్రవహిస్తోంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్పేట, టోలిచౌకి , పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్కు వర్షపు నీరును తీసుకెళ్లే చరిత్ర ఈ నాలాది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని.. హుస్సేన్ సాగర్కు వర్షపు నీటిని తీసుకొచ్చే ఏకైక నాలాగా దీనికి ప్రత్యేక స్థానం ఉందని స్థానికులు గుర్తు చేశారు. ఇప్పుడీ నాలా పునరుద్ధరణపై హైడ్రా దృష్టి పెట్టింది.