పునర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్యులు
అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్
సుల్తాన్బజార్, ఫిబ్రవరి 2: ప్రమాదవశాత్తు ఓ బాలిక బ్లేడు ముక్కలు మింగింది. బాలిక గొంతులో నుంచి బ్లేడు ముక్కలను తొలగించిన ఉస్మానియా వైద్యులు ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ బి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం బాలిక గొంతులో నుంచి బ్లేడు ముక్కలను తొలగించి ప్రశంసలు పొందారు. బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన 16 ఏండ్ల పి.శ్వేత జనవరి 29న ప్రమాదవశాత్తు ఇంట్లో బ్లేడు (రెండు ముక్కలు) మింగింది.
బాలిక తండ్రి రాములు వెంటనే స్థానిక దవాఖానకు తీసుకువెళ్లగా అక్కడి వైద్యుల సూచన మేరకు గతనెల 30వ తేదీన ఉస్మానియా దవాఖానకు తీసుకువచ్చారు. ఓపీలో సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి.రమేశ్ పరిశీలించి చికిత్స నిమిత్తం బాలికను మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి పంపించారు. అదేరోజు బాలికను పరీక్షించిన వైద్యులు, స్కానింగ్ చేసి రెండు బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఆ విభాగం హెచ్వోడీ డాక్టర్ బి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ఎండోస్కోపి చికిత్స విధానం ద్వారా గొంతులోనుంచి రెండు బ్లేడ్ ముక్కలను విజయవంతంగా తొలగించి బాలికకు పునర్జన్మను ప్రసాదించారు.
బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎటువంటి అపాయం లేకపోవడంతో నోటి ద్వారా ఆహారం, నీరు తీసుకునేందుకు వైద్యులు అనుమతించారు. ఇలాంటి కేసుల్లో గొంతు భాగంలో చిన్న ఆపరేషన్ చేసి బ్లేడ్ను తొలగించి కుట్లు వేయాల్సి ఉంటుందని, ఆపరేషన్ లేకుండా నేర్పుతో బ్లేడు ముక్కలను గొంతులో నుంచి తొలగించడం మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చని డాక్టర్ బి. రమేశ్కుమార్ను, వైద్యులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.