HomeHyderabadHyderabads Annual Exhibition Numaish To Start On January 1
జనవరి 1 నుంచి పారిశ్రామిక ప్రదర్శన
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు.
అనుమతులు పొందిన తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు
46 రోజుల పాటు స్టాళ్ల నిర్వహణ
అబిడ్స్, డిసెంబర్ 5 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ప్రదర్శనను నిర్వహిస్తూ వస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శించడంతో పాటు విక్రయాలు చేపడుతారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ శాఖ ప్రగతిని స్టాళ్ల ద్వారా ప్రజలకు వివరించేందుకు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తాయి. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా కొనసాగుతున్న విద్యా సంస్థల ద్వారా విద్యావ్యాప్తికి పాటు పడుతున్నాయి.
ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థల నిర్వహణకు వినియోగిస్తున్నాయి. కాగా 2024లో పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను సొసైటీ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఇప్పటికే దరఖాస్తుల ఆహ్వానం, టెండర్ల ద్వారా ప్రధాన స్టాళ్ల కేటాయింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, సెక్రటరి బి.హనుమంతరావు, జాయింట్ సెక్రటరి చంద్రజిత్ సింగ్, కోశాధికారి ఈ. రాజేందర్ కుమార్ పర్యవేక్షణలో ఈ సంవత్సరం అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించేందుకు గాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పలు విభాగాలకు చెందిన కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. మైదానంలో రెండు వేల వరకు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. మినీ ట్రైన్కు మరమ్మతులు చేపట్టనున్నారు.
ప్రతి సంవత్సరం 20 లక్షల వరకు సందర్శకులు..
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం 46 రోజుల పాటు నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు ప్రతి సంవత్సరం 20 లక్షల వరకు సందర్శకులు వస్తారని నిర్వాహకులు అన్నారు. గతేడాది భారీగా 20 లక్షలపై చిలుకు సందర్శకులు సందర్శించినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం విషయమై ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని ప్రదర్శనను పకడ్బందీగా నిర్వహిస్తే గతం కంటే ఎక్కువ మంది సందర్శకులు తరలి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.