బంజారాహిల్స్, జనవరి 24 : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘హిట్ అండ్ రన్’ కేసు నమోదైంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్విలేజ్ సమీపంలోని గాంధీనగర్లో నివాసముంటున్న లింగాల తారకరామ్(30) మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో బౌన్సర్గా విధులు నిర్వహిస్తుంటాడు.
బుధవారం తెల్లవారుజామున విధులు ముగించుకొని తనతో పాటే పనిచేస్తున్న రాజు అనే మరో బౌన్సర్తో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఉదయం 5గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 36లోని పెద్దమ్మ గుడి చౌరస్తా సమీపంలోకి రాగానే అతివేగంగా వెనుకనుంచి దూసుకువచ్చిన గుర్తుతెలియని కారు తారకరామ్ బైక్ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిన తారకరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ను ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోయింది.
వెనక కూర్చున్న రాజుకు తీవ్ర గాయాలుకాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన వ్యాపారి ద్వారంపూడి నాగ పేరుతో ఉన్న వెర్నా కారు(టీఎస్08 జేఎన్ 6663)గా గుర్తించారు. కారు నడిపిస్తున్న యువకుడితో పాటు కారులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, మృతుడు తారక్రామ్ కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇప్పించాలంటూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకువచ్చి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వద్ద ఉంచి ఆందోళనకు దిగారు.