సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ విచారణల ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. నామమాత్రపు విచారణలు, అనవసర సర్టిఫికెట్ల నిబంధనలతో అధికారులు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్త్న్నురు. క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేని సిబ్బంది వైఖరిపై ఓటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా ముసాయిదా జాబితాలోని ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఓటర్ల ఏరివేత పేరిట నోటీసులు జారీ చేసిన యంత్రాంగం, విచారణల పేరిట ప్రహసనం నడిపిస్తోంది. దశాబ్దాలుగా ఇకడే స్థిరపడి, అనేకసార్లు ఓటు హకు వినియోగించుకున్న స్థానికులకు కూడా నోటీసులు పంపి బెంబేలెత్తిస్తున్నారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించేందుకు కుటుంబ సభ్యులు గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలు చూపించినా కుల ధృవీకరణ పత్రాలు, పాస్ పోర్టులు తేవాలంటూ నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో విచిత్రమైన ఉదంతాలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12 లక్షల 53 వేల పైచిలుకు ఓటర్లకు నోటీసులు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా..ఇప్పటి వరకు 9,91,214 మందికి నోటీసులు జారీ చేశారు. దాదాపు 2,11, 888 మంది ఓటర్లకు విచారణలను పూర్తి చేశారు. జారీ చేసిన నోటీసుల్లో దాదాపు2,62, 662 మంది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేవలం 116 మంది ఓటర్లు మాత్రమే స్పందించిన వారికి హియరింగ్ తేదీ, సమయాన్ని అధికారులు రీ షెడ్యూల్ చేశారు. కాగా ఓటర్లను భాగస్వాములను చేస్తూ పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈ కీలక ప్రక్రియను, ఎన్నికల సిబ్బంది అవగాహనా రాహిత్యంతో తుడిచిపెట్టేసే ధోరణిలో నిర్వహించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.