హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఆధునిక జీవనశైలిలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారింది. ఊబకాయం కారణంగా బరువు పెరగడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. ఊబకాయంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు తాజాగా అపోలో దవాఖానలు నిర్వహించిన ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ సర్వే-2026’ వివరాలను వెల్లడించింది. 81.3%తో హైదరాబాద్, ఢిల్లీలు రెండో స్థానంలో నిలువగా, ముంబై 81.6%తో మొదటి స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ నగరంలో 37.5 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, వీరంతా ఊబకాయంతో బాధపడుతున్నట్టు సర్వే రిపోర్టు తెలిపింది. గతేడాది నగరంలో ఊబకాయంతో బాధ పడేవారు 63% ఉండగా, ఈ ఏడాది వీరి సంఖ్య 18% పెరిగి 81.3%గా నమోదవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనిప్రధాన నగరాలైన కోల్కతా (78.4%), బెంగళూరు (77.8%), చెన్నై (77.3%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చోవడం, జంక్ఫుడ్ విచ్చలవిడిగా తీసుకోవడం ఒబేసిటీకి కారణమవుతున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. దీనికి తోడు స్మార్ట్ఫోన్లను విపరీతంగా వినియోగించడం కూడా సమస్యకు ప్రధాన కారణమని తెలిపింది.
జంక్ఫుడ్, స్టెరాయిడ్ల వినియోగంతో..
నిద్రపట్టే వరకు ఫోన్ చూస్తూనే ఉండటం, గాఢనిద్ర సమయంలో ఆటంకాల కారణంగా జీవనక్రియల రుగ్మతలకు కారణమవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) గతంలో జరిపిన అధ్యయనాల్లో సైతం హైదరాబాద్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. నగరాన్ని ‘డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా మారుస్తున్నట్టు పేర్కొంటున్నారు. నగరంలో ఇదే ట్రెండ్ కొనసాగితే 20 నుంచి 30 ఏండ్లకే జీవనశైలి వ్యాధులు చుట్టుముడతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు మానసిక వ్యాధులు పెరిగి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడుతున్నారు. స్క్రీన్టైమ్ పెరుగడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, గంటల కొద్దీ లేవకుండా కూర్చోవడం, జంక్ఫుడ్ కారణంగా ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నట్టు చెప్తున్నారు. స్టెరాయిడ్లను అధికంగా వినియోగించడం అధిక బరువుకు కారణమవుతున్నట్టు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శారీరకశ్రమతోపాటు జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వెంటనే డైట్ విషయంలో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యులు సూచిస్తున్నారు.