హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాల భవనం హైదరాబాద్లో నిర్మాణం కాబోతోంది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో 57 అంతస్తుల భవనాన్ని( SAS Crown ) నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం 4.5 ఎకరాల్లో జరుగుతుండగా, ఐదు టవర్లలో 235 ఇండ్లను నిర్మించబోతున్నారు. ఈ భవనం బెంగళూరులోని 50 అంతస్తులను అధిగమించి.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా నిలుస్తుందని భవన నిర్మాణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ బిల్డింగ్ను SAS Infra నిర్మిస్తోంది. 57 అంతస్తుల భవన నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( HMDA ) అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మొదటి దశ పనులు 2025 ఏడాది నాటికి పూర్తవుతాయని SAS Infra ప్రతినిధి ఆశీష్ భట్టాచార్య తెలిపారు. ఈ భవనంలో ఒక చదరపు అడుగు రూ. 8,950ల ధర పలుకుతుందని పేర్కొన్నారు. ఒక్క ఇల్లు రూ. 6 కోట్ల ఖరీదు ఉంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అని ప్రాజెక్టు అధికారి వెల్లడించారు. హైదరాబాద్లో ఇదే ప్రథమ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్.