సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పండుగ సందడి మొదలవుతుంది. చలి తీవ్రత, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటిస్తుంది. దీంతో నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పండుగ సందర్భంగా ఇండ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఈ పండుగ ప్రభావంతో జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ నగరం దాదాపు సగానికి పైగా ఖాళీ అవుతుంది. చాలా ప్రాంతాల్లోని ఇండ్లకు తాళాలు వేసి ఉంటాయి. ఈ నేపథ్యంలో భద్రతపై దృష్టిసారించిన మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా స్వీయ భద్రతపై దృష్టిసారించారు. టెక్నాలజీ సహాయంతో తన నివాసాలు, సంస్థలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఏదైనా జరిగితే వెంటనే అప్రమత్తమవుతున్నారు.
భద్రతకు పెద్ద పీట..
గతంలో సరైన భద్రత లేకపోవడంతో దసరా, సంక్రాంతి సెలవులకు ఊళ్లకు వెళ్లి వచ్చే సరికి చాలా ఇండ్లల్లో దొంగతనాలు జరిగేవి. ఈ పరిస్థితితో ప్రజల్లో ఆందోళన ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చింది. భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. దీంతో నేరగాళ్లపై నిఘా పెరిగింది. పక్కా ఆధారాలతో నేరగాళ్లను పట్టుకుంటున్న పోలీసులు.. న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ దొంగతనాలతోపాటు చాలా వరకు నేరాలు తగ్గుముఖం పట్టాయి.
పెరిగిన స్వీయ భద్రత..
అయితే, పండుగల సమయంలో చాలా వరకు ఇండ్లకు తాళాలు కనిపిస్తాయి. ఇదే అవకాశంగా తీసుకునే నేరగాళ్లు చెలరేగిపోతారు. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతారు. ఇప్పడు అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచడంతో దొంగలకు ఆ అవకాశం లేదు. ప్రజలు కూడా అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. భద్రత కోసం ఇండ్లు, కార్యాలయాలు, సంస్థల వద్ద సీసీ కెమెరాలు, టీవీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. టెక్నాలజీ సహాయంతో తమ చేతిలో ఉండే సెల్ఫోన్లకు సీసీ కెమెరాలను అనుసంధానం చేసుకుంటున్నారు. దీంతో ఎంత దూరంలో ఉన్నా సరే.. తమ నివాసాలు, సంస్థలను ఎప్పటికప్పుడు చేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. దీంతో స్వీయ భద్రత కూడా పెరిగింది.
నిరంతర పెట్రోలింగ్..
సంక్రాంతి పండుగకు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మూడు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు గత వారం రోజులుగా అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా దొంగతనాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నేరగాళ్లు ఆయా ప్రాంతాల నుంచి తప్పించుకునే మార్గాలపై నిఘా పెంచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పని చేయని సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించి, ఫుటేజీ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
విజిబుల్ పోలీసింగ్..
పెట్రోలింగ్ను రాత్రి, పగలూ నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ను పెంచే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాలనీ, బస్తీ, అపార్టుమెంట్ల సంఘాలతో క్షేత్ర స్థాయిలో గస్తీ నిర్వహించే సిబ్బంది సమావేశమవుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఉరెళ్లండి.. పండుగను సంతోషంగా జరుపుకోండి.. మేం మీకోసం ఉన్నామంటూ.. పోలీసులు ప్రజలకు పూర్తి భరోసా ఇస్తున్నారు.
పాత నేరస్తులపై నిఘా..
గతంలో పండుగల సమయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముఠాలు, తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేసే ముఠాలపై పోలీసులు నిఘా పెంచారు. ఇందుకు జైలు నుంచి విడుదలైన నేరగాళ్ల వివరాలు సేకరించి, నేరగాళ్లు నివాసముండే ప్రాంతాలు, నివాసాలపై నిఘా పెట్టారు. టెక్నాలజీ, స్థానికుల సహాయం నేరగాళ్ల ప్రతి కదలికను గమనిస్తున్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రధానంగా నేరగాళ్ల నెట్వర్క్పై పోలీసులు దృష్టి సారించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.