సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నష్టాలు తగ్గి లాభాల బాట పడుతున్నది. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యం వంటి పలు అంశాలపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో క్రమంగా ఆదాయంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరుగుతోంది. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో 2021-22లో గ్రేటర్ ఆర్టీసీ ఆదాయం రూ.750.33 కోట్లు నమోదు కాగా, ఖర్చు మాత్రం రూ.1,646.04 కోట్లు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. నష్టం రూ.895.72 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.1,563 కోట్ల ఆదాయం నమోదు కాగా.. రూ.1,876.51 కోట్లు ఖర్చు చూపించారు.గత ఏడాదితో పోల్చితే రూ.313.50 కోట్లకు నష్టం తగ్గిందని అధికారులు తెలిపారు.
ఫలితాలిస్తున్న ప్రత్యేక రాయితీలు
సిటీ బస్సుల ఆదాయాన్ని పెంచి.. నష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో గ్రేటర్ ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా టీ-24, ఎఫ్ 24, టీ-6 వంటి ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ నగర ప్రయాణికులకు ఆర్టీసీ మరింత చేరువైంది. నగరం చుట్టూ ఏర్పడిన కొత్త కాలనీల వరకు, విద్యార్థులు, విద్యా సంస్థల కోసం, ఐటీ ఉద్యోగుల కోసం సైబర్ లైనర్ పేరుతో ఏసీ బస్సులు, పండుగ రోజులు, సీజన్ వారీగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అలాగే మహిళల కోసం ప్రత్యేక బస్సులు, మెట్రో రైలుకు అనుసంధానంగా కొన్ని బస్సులను నడుపుతోంది. దీంతో పాటు సంస్థ డ్రైవర్లు, కండక్టర్లు అంకిత భావంతో పనిచేయడంతో ఆర్టీసీ ముందుకెళ్తున్నదని ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ.యాదగిరి అభిప్రాయపడ్డారు.
పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో..
కరోనా తర్వాత ఆర్టీసీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు ట్రాన్స్పోర్టు, మెట్రో రైలు, ఓలా, ఊబర్, రాపిడో వంటి వాటిని తట్టుకుని ఆర్టీసీ నిలబడుతున్నది. ఈ క్రమంలోనే 2022-23 సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేషియో 68.37 శాతానికి పెంచుకుంది. దీంతో గ్రేటర్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సుల్లో ప్రస్తుత సంవత్సరంలో ప్రతి కిలోమీటర్కు రూ.48.23 చొప్పున ఆదాయం నమోదవుతుంది. గత ఏడాదితో పోల్చితే.. ఈ సారి రూ.12.31 ఆదాయం పెరిగింది. గత ఏడాదిలో ప్రతి కిలో మీటర్కు రూ.37.89 నష్టం రాగా… ఈ సంవత్సరంలో రూ.12.43కి వరకు నష్టం తగ్గింది. అంటే గత ఏడాది కంటే ఈ సారి రూ.25.46 వరకు నష్టం తగ్గిందని ఆర్టీసీ వార్షిక లెక్కలు చెబుతున్నాయి.