Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధారణంగా జులై 20వ తేదీ నాటికి హైదరాబాద్ నగరంలో సగటున 101.2 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ ఏడాది ఈ సమయం నాటికి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 122.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వారం చివర వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.