కొత్త ఆశలు, ఆశయాలను మోసుకొస్తూ.. సరికొత్త ఉషోదయం మరో రెండ్రోజుల్లో (2023) ఘనంగా ఆవిష్కృతం కానున్నది. 2022కు గుడ్బై చెబుతూనే.. కొత్త ఏడాదికి ఫుల్జోష్తో స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భాగ్యనగరానికి ‘ప్రగతి’ నామ సంవత్సరంగా నిలిచింది. గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అనేక అంశాల్లో తనదైన ముద్రను వేసుకున్నది. విశ్వపథాన అడుగులు వేస్తూ.. ప్రత్యేకతను చాటుకున్నది. ఈ ఒక్క ఏడాదిలోనే గ్రేటర్లో ఎస్ఆర్డీపీలో 9 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఏడు బస్తీ దవాఖానలు, పాదచారుల భద్రతకు రూ.28.10 కోట్లతో చేపట్టిన 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలూ ఏర్పాటయ్యాయి. సీఆర్ఎంపీతో రూ.261.74 కోట్లతో 114.80 కిలోమీటర్ల రహదారులను పునరుద్ధరిస్తే.. ముంపు ముప్పు తప్పించే ‘ఎస్ఎన్డీపీ’ సత్ఫలితాలిచ్చింది. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ.. ఈ ఏడాది 678 గృహాలను పంపిణీ చేశారు. ఇవే కాక.. అనేక అద్భుత ప్రాజెక్టులూ పట్టాలెక్కాయి. నగరవాసుల ఆకాంక్షలను నెరవేర్చాయి. ఇలా ఈ ఏడాది భాగ్యనగరం అభివృద్ధిలో దూసుకుపోయింది. నూతన సంవత్సరంలో ప్రపంచపటంలో మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమైంది.
సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. సిగ్నల్ రహిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, కార్పొరేటర్ల కార్యాచరణతో పనుల వేగవంతానికి విశేష కృషి చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషి మూలంగా 2022 సంవత్సరంలో జీహెచ్ఎంసీ గణనీయమైన ప్రగతి సాధించింది.
సీఆర్ఎంపీ : ఈ సంవత్సరంలో రూ.261.74 కోట్లతో 114.80 కిలోమీటర్లు రోడ్డు రీ-కార్పెట్ చేశారు.
రహదారులు : సీసీ రోడ్లు, వీడీసీసీ ఇతర రోడ్ల ఏర్పాటుకు 3059 పనులను రూ. 814.95 కోట్ల వ్యయంతో చేపట్టగా రూ.219.53 కోట్ల విలువ గల 821 పనులు పూర్తి చేశారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పాదచారుల భద్రత, ప్రమాదాల నివారణకు ఈ సంవత్సరం రూ. 28.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మదీనాగూడ, మియాపూర్, పంజాగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, నేరెడ్మెట్ బస్స్టాండ్, ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డలో అందుబాటులోకి వచ్చాయి.
ఈ విభాగం ద్వారా రోడ్ల నిర్వహణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, డి-సిల్టింగ్, నాలా మరమ్మతులు, నిర్మాణాలు, కమ్యూనిటీ హాల్, ఓపెన్ శ్మశానవాటికల ప్రహారీల నిర్మాణాలకు ఈ సంవత్సరం రూ. 2168.44 కోట్ల అంచనా వ్యయంతో 8538 పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.597.43 కోట్ల విలువ గల 3128 పనులు పూర్తయ్యాయి.
నగరం క్లీన్ గా ఉండాలంటే ఘన, ద్రవ పదార్థాల వ్యర్థాలను కలెక్షన్, ట్రాన్స్ పోర్ట్, ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక, సెకండరీ స్థాయిలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డు తరలించే సందర్భంలో రోడ్లపై వెదజల్లకుండా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నగరంలో కూడా ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ సంవత్సరం అదనం గా వివిధ రకాలైన 60 వాహనాలను ఏర్పాటు చేశారు. అందు లో 20 రీ-ఫ్యూజ్డ్ కంటెయినర్లు, మరో 20 హుక్ మౌంటెడ్ వెహికల్లు, సిలిండ్రికల్ స్టాటిక్ కంటెయినర్ ఇంకొక 20 వాహనాలను ఈ సంవత్సరంలో సమకూర్చి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
నిరుపేదలకు రెండు పడకల గదుల నిర్మాణ గృహాలు ఆత్మ గౌరవ ప్రతీకగా నిలుస్తాయి. అందులో భాగంగా పైసా ఖర్చు లేకుండా ఈ సంవత్సరంలో 678 గృహాలు పంపిణీ చేశారు. ఖైరతాబాద్లో ఇందిరా నగర్ కాలనీలో రూ. 17.85 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 210 గృహాలు, అదే విధంగా ఓల్డ్ మారేడ్ పల్లిలో రూ. 36.27 వ్యయంతో 22 బ్లాక్ లలో చేపట్టిన 468 గృహాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పేదలు శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకునేందుకు అనువైన స్థలంలో అన్ని మౌలిక వసతులతో ఈ సంవత్సరంలో రూ.13.88 కోట్ల వ్యయంతో 3 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసేందుకు టెండర్లు పిలిచారు.
నగరంలో నివసించే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సంవత్సరం 7 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. వీటితో మొత్తం 263 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి 57 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో రెండు భవన నిర్మాణ వ్యర్థాల (సీ అండ్ డీ) రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ జోన్ వైపు శామీర్ పేట మండలం తూంకుంట, చార్మినార్ జోన్ వైపు శంషాబాద్ మండలం సాతంరాయి కుంట గ్రామంలో ఒకొకటి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వ్యర్థాల రీసైక్లింగ్ చేస్తారు. వీటితో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 2000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఉంటాయి. ఇంతకు ముందు జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్లాంట్ కలవు.
ఎస్ఎన్డీపీ : లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ఈ సంవత్సరంలో రూ. 985.45 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీలలో మొత్తం 56 పనులను చేపట్టగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 737.45కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 35 పనులలో సుమారు 17.24 కోట్ల విలువ గల 2 పనులు పూర్తి అయ్యాయి.
అందులో రసూల్పుర వద్ద పికెట్ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం వలన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాతో పాటుగా 40 కాలనీలకు ప్రయోజనం కలిగింది. అదే విధంగా ఎల్బీనగర్జోన్లో నాగోల్లో రూ. 7.26 కోట్ల వ్యయంతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు పూర్తయ్యాయి. తద్వారా పలు కాలనీలకు వరద ముంపు నుంచి విముక్తి కలిగింది.
స్ట్రామ్ వాటర్ డ్రైన్ : నాలా మరమ్మతులు, నూతన పనులను చేపట్టేందుకు ఈ సంవత్సరంలో రూ. 117.86 కోట్ల వ్యయంతో 228 పనులు పూర్తి చేశారు.
పూడికతీత : నాలా పూడికతీత పనులు ఏడాది పాటు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరంలో 3.61 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేశారు.
మహిళలు ఆర్థికంగా సామాజిక అభివృద్ధికి జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 372 కోట్ల 33 లక్షల 60 వేల విలువ గల బ్యాంక్ లింకేజ్ రుణాలను 4890 మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశారు. రూ.1.68 కోట్ల రుణాలను 77 దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశారు.
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు మొదటి దశ వివరాలు
తొలి విడతలో రూ. 5937కోట్లతో 47 చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటి వరకు 33 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 17 ఫ్లై ఓవర్లు, 5 అండర్పాస్లు, ఏడు ఆర్వోబీ/ ఆర్యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జిలు, విస్తరణ బ్రిడ్జి ఒకటి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టు చేపట్టారు. రూ.4,357.85కోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 14 చోట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
ఎస్ఆర్డీపీ ఫేజ్-2లో భాగంగా రూ.3115 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.
త్వరలో ఈ పనులు చేపట్టనున్నారు.
ఆరున్నరేండ్లలోనే 33 చోట్ల సిగ్నల్ రహిత ప్రయాణం
ఈ ఏడాదిలోనే తొమ్మిది ప్రాజెక్టులు అందుబాటులోకి
సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రయాణం సాఫీగా సాగాలంటే వాహనం ఉంటే సరిపోదు…సరైన రోడ్డు ఉండాలి. ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం చేపట్టి అనతికాలంలోనే సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థగా మార్చారు. తొలివిడతలో రూ. 5937 కోట్లతో 47 చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను తీసుకుని, కేవలం ఆరున్నరేండ్లలోనే 33 చోట్ల ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఈ ఏడాదిలోనే తొమ్మిది ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుంది.