సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ చేసిన వారిపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్మీడియాలో వైరల్ చేయడంపై ఐదు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక యూట్యూబ్ చానల్ రిపోర్టర్ కూడా ఉండడంతో నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. మిగతా వారికి సంబంధించిన వివరాలను ఐపీ చిరునామాలతో తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే ఆయా సోషల్మీడియా సంస్థలకు వీడియోలు తొలగించాలని కోరుతూ పోలీసులు లేఖలు రాశారు. లైంగికదాడి కేసు నిందితులు వీడియోలు తీసి వాటిని తమ స్నేహితులకు ఫార్వర్డ్ చేయడంతో, అక్కడి నుంచే బయటకు వచ్చినట్లు యూట్యూబ్ చానల్ రిపోర్టర్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది.