సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): లోన్యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయుల సహకారంతో వందల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న చెన్నై, ఢిల్లీకి చెందిన రెండు అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ప్రధానంగా చెన్నై నుంచి నిర్వహిస్తున్న ఒక ఖాతాలో ఎక్కువ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, బెంగళూర్కు సంబంధించిన లోన్యాప్ల కేసుల్లో పలు లింక్లు బయటపడుతూ వచ్చారు. చెన్నైకి చెందిన బ్యాంకు ఖాతా లింక్లు తాజాగా వెలుగులోకి రావడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం వ్యవహారంపై కూపీలాగుతున్నాయి.
లోన్యాప్ ఆగడాలు..
ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే అడగగానే, కొన్ని సందర్భాల్లో అడగకుండానే నిమిషాల్లోనే రుణాలిస్తూ అమాయకులను లోన్యాప్ నిర్వాహకులు వలలో వేసుకుంటున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించినా, వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసి రుణ గ్రహీతలను పీల్చి పిప్పిచేస్తున్నారు. వీరి ఆగడాలను తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించారు…
ఈ నేపథ్యంలో రెండేండ్ల కిందట హైదరాబాద్ పోలీసులు రుణయాప్లపై పలు కేసులు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా లోన్యాప్ నెట్వర్క్ను ఛేదించారు. చైనీయులతో పాటు ఢిల్లీ, బెంగళూర్కు చెందిన రుణయాప్ల నిర్వాహకులు, వాటికి సహకరించే కాల్సెంటర్ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. మొదటి దఫా హైదరాబాద్ పోలీసులు వేగంగా స్పందించడంతో కొన్నాళ్లు రుణయాప్ల ఆగడాలు ఆగిపోయాయి. కరోనా ప్రభావం తగ్గడంతో చైనీయులు తిరిగి రుణయాప్ల దందాను మొదలు పెట్టి, ప్రజలను వేధిస్తున్నారు. ఇందుకు కమీషన్ల పద్ధతిలో కరెంట్ బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత ఖాతాలు తీసుకుంటూ చైనీయులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ అమాయకుల నుంచి దోచిన డబ్బును, హవాలా ద్వారా తమ దేశాలకు పంపిస్తున్నారు.
ఈసారి కూడా.. అదే పట్టు
హైదరాబాద్ పోలీసులు రెండో దఫాలోనూ అదే పట్టుతో ముందుకు వెళ్తున్నారు. పలువురిని అరెస్టు చేశారు. ఇంకొందరిని అరెస్టు చేసేందుకు వేట కొనసాగుతుంది. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్న పోలీసులు.. నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల బ్యాంకు లావాదేవీలను గుర్తించి వేట మొదలుపెడుతున్నారు. ఈ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా మారిన ఆర్థికపరమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. దీంతో ఆయా బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టారు. క్షేత్ర స్థాయిలో ఆయా ఖాతాల గూర్చి తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.