పార్టీలు, ఈవెంట్లపై పటిష్ట నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ పరిధిలో ఉన్న 800 ఓయో రూమ్లు, పబ్లు, ఫామ్ హౌజ్లు, గెస్టు హౌజ్లు, ఇతర విడిది ప్రదేశాలను గుర్తించి వాటి యజమానులు, నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో నోటీసులో వివరించారు.
వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా వీటన్నింటిని కలిపి ఒకే గ్రూప్లోకి తీసుకువచ్చారు. వాటిలో ఏం జరుగుతున్నది, ఎవరు బుకింగ్ చేసుకున్నారు, వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎంతమంది హాజరవున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసే విధంగా ఓ ప్రత్యేక సిస్టమ్ను రూపొందించారు. దీంతో వేడుకలు జరిగే వేదికలపై నిత్యం పోలీసు నిఘా ఉంటుంది.