17 ఏండ్లుగా చోరీలు..
తాజాగా 43 ఇండ్లలో దొంగతనాలు
దొరికిన మోస్ట్ వాంటెడ్ చంద్రి
57 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): తాళం కనిపిస్తే చాలు.. ఆ ఇంటిని దోచేస్తాడు. ఇలా 17 ఏండ్లుగా చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. అతడే కోటిపల్లి చంద్రి. ఏడు సార్లు జైలుకు వెళ్లివచ్చినా..మారని అతడు.. మళ్లీ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తూ.. పోలీసులకు చిక్కాడు. అతడి అరెస్టుతో 43 చోరీల కేసుల మిస్టరీ వీడిపోయింది. గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం…బండారి లే-అవుట్కు చెందిన కోటిపల్లి చంద్రి వృత్తిరీత్యా కార్మికుడు. 2005 నుంచి ఇప్పటి వరకు అనేక చోరీలు చేశాడు.
ఒంటరిగా తిరుగుతూ రాత్రి సమయాల్లో తాళం వేసి ఉండే గృహాల్లో దొంగతనం చేస్తాడు. ఆ సొత్తుతో జల్సాలు చేస్తాడు. కొద్ది రోజుల కిందట జైలు నుంచి బయటికి వచ్చిన చంద్రి.. తన ఆధారాలు ఎక్కడ కూడా దొరకకుండా జాగ్రత్త పడుతూ దాదాపు 43 దొంగతనాలు చేశాడని విచారణలో తేలింది. నిందితుడి నుంచి 57 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.70 లక్షల నగదును మాదాపూర్ సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.